కేసీఆర్ అంటే ఆసరా పెన్షన్దారులకు ఒక నమ్మకం.. విశ్వాసం. తెలంగాణ సాధించి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి అమలు చేయడంతో ఆ నమ్మకం మరింత బలపడింది. 2014కు ముందు కేవలం రూ.200 మాత్రమే ఉన్న పెన్షన్లను మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.వెయ్యికి పెంచగా, రెండోసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ.3,016, మిగతా వాళ్లకి రూ.2,016 చొప్పున ఇస్తూ ఆదుకోవడంతో వృద్ధులు కేసీఆర్ను తమ పెద్ద కొడుకులా భావించారు. దివ్యాంగులకు ఇటీవలే రూ.4,016కు పెంచారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6016, మిగతా వర్గాలకు రూ.5016 ఇస్తానని మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వడంతో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఇలా ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఇచ్చిన హామీపై పూర్తి స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
-కరీంనగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ)
మాది నేత కుటుంబం. పోలియో వచ్చి కాళ్లు సచ్చుబడి పోయినయ్. మెల్ల మెల్లగా నడువ గలుగుతగని, ఎక్కువ దూరం వెళ్లలేను. వీపుల పెద్ద కంతి ఉంది. అసలే పేద కుటుంబంల పుట్టిన నాకు చదువుకుని ఉద్యోగం చేయాలని ఉంది. సర్కారు బడిలో పదో తరగతి చదువుకుని ఆర్థిక పరిస్థితి బాగోలేక మానేద్దామనుకున్న. దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ రూ.3016లు చదువులకే ఖర్చు చేస్తున్న. పింఛన్ ఇస్తున్నప్పటి నుంచి ఇంటర్ పూర్తి చేసి, ఇప్పుడు అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్న. కేటీఆర్ సార్ పుట్టిన రోజున గిఫ్ట్ ఏ స్మయిల్ కింద నాకు త్రీ వీలర్ స్కూటీ ఇచ్చిన్రు. రోజూ స్కూటర్పైనే కాలేజ్కి పోతున్న. సైకిల్ కొనే స్థోమతే లేని నాకు కేటీఆర్ సారు స్కూటర్ ఇచ్చిన్రు. ముందుకు పోవాలన్న ధైర్యం వచ్చింది. సమాజంలో గౌరవంగా బతుకుతున్న. బాగా చదువుకుని కేటీఆర్ సార్ పేరు నిలబెడుత. ఆసార్తో సిరిసిల్ల బాగా డెవలప్ అయ్యింది.
-వెల్లి గణేశ్, దివ్యాంగుడు, సిరిసిల్ల
నాకు ఇద్దరు బిడ్డలు. వాళ్లు చిన్నగున్నప్పుడే నా భర్త చనిపోయిండు. ఇద్దరు బిడ్డల పెండిళ్లు చేసిన. ఇల్లు కూడా లేదు. ఒక్కదాన్నే నెహ్రునగర్ల కిరాయికి ఉంటున్న. చెవులు సక్కగ వినపడవు. మోకాళ్ల నొప్పులున్నయి. ఏం పనిచేద్దామన్నా చేతగాని నాకు కేసీఆర్ సార్ ఇత్తున్న రూ.రెండు వేల పింఛనుతోనే బతుకుతున్న. ఆ పైసలే రాకుంటే నా బతుకేమైతుండెనో. ఇప్పటి వరకు నేను బతుకున్ననంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నడన్న ధైర్యంతోనే. ఇప్పుడున్న పింఛను పైసలను రూ.5 వేలకు పెంచుతనన్నడు. కొడుకులే లేని నాకు కేసీఆర్ అన్నంపెట్టే దేవుడు. ఆ దేవుడే మళ్లీ రావాలని కోరుకుంటున్న.
-గుజ్జేటి పోచ్చవ్వ (సిరిసిల్ల )
కరీంనగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. అది కూడా రూ. 200 మాత్రమే ఇచ్చే వారు. వృద్ధులైతే 65 దాటితే తప్ప పెన్షన్లు వచ్చేవి కావు. అంతే కాకుండా ఊరికి పది పదిహేను పెన్షన్లు దాటేవి కాదు. ఎవరైనా వృద్ధులు చనిపోతే తప్ప పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో 2014లో తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వీరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకేసారి దివ్యాంగులకు రూ.1,500, మిగతా వర్గాలకు రూ.వెయ్యి చొప్పున అందించారు. అంతే కాకుండా, గతంలో ఇచ్చిన సాంఘిక భద్రతా పెన్షన్ను ‘ఆసరా’ పేరుతో అమలు చేశారు. వీరితో పాటు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత, నేత కార్మికులు, హెచ్ఐవీ, పైలేరియా బాధితులను కూడా చేర్చా రు. తాజాగా, కిడ్నీ బాదితులను కూడా చేర్చి అండగా నిలిచారు. అంతేకాకుండా, వృద్ధులకు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల వయోపరిమితిని కూడా కుదించారు.
సమాజం, కుటుంబంలో నిరాదరణకు గురైన వారందరికీ పెద్ద కొడుకులా నిలబడి ఆసరా పెన్షన్ ఇస్తున్న సీఎం కేసీఆర్ పట్ల వీరికి అచంచలమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ వారి పట్ల దయార్ద్ర హృదయంతో వ్యవహరించకుంటే తమ బతుకులు మరోలా ఉండేవని చాలా మంది లబ్ధిదారులు చెబుతున్నారు. గత జూలైలో దివ్యాంగులకు రూ.4,016 పెంచారు. అప్పుడే మిగతా వర్గాలకు కూడా పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే మాదిరిగా ఇప్పుడు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో రూ.5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3 వేలు పెంచుతామని, ఏడాదికి రూ.500 చొప్పున ఐదేండ్లలో రూ.5 వేలు చేస్తామని వెల్లడించారు. దివ్యాంగులకు కూడా రూ.6 వేల వరకు పెంచుతామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ మ్యానిఫెస్టోలో స్పష్టం చేశారు.
నాకు పెద్దపల్లి మండలం భోజన్నపేటకు చెందిన మల్లయ్యతో పెండ్లి జరిగింది. మాకు పిల్లలు కాలే. నా పెనిమిటి 20 ఏండ్ల క్రితం ఆరోగ్యంబాగాలేక కాలంజేసిండు. అక్కడేముండాలని మా తల్లిగారి ఊరు కొలనూర్కు వచ్చి బతుకుతున్న. ఇప్పుడు నాకు 70 ఏండ్లపైనే ఉంటయ్. మూడేండ్ల కిందటి దాకా కూలీనాలీ పనుల ఎళ్లి బతికేది. ఇప్పుడు సాతనైతలేదు. ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్న. నన్ను సాదేటోళ్లు ఎవరు లేరు. కేసీఆర్ సార్ పింఛన్ రూ.2 వేలు అత్తనయ్. అండ్లనే ఇల్లు కిరాయి కట్టి తిండికి బతుకుతున్న. రూ.1కిలో బియ్యం ఇత్తర్రు. పాణం మంచిగ లేకపోతే సర్కార్ దవాఖానకు పోతన్న. దసరా పండగకు చీర అచ్చింది. ఇగ ఎం ఖర్చులు లేవు. సర్కార్ ఇచ్చే వాటితోనే బతుకు ఎల్లుతుంది. కేసీఆర్ సార్ దయ వల్లనే మంచిగ బతుకుతున్న. ఆ సారే మళ్లా రావాలె.
-అట్ల రామక్క, ఒంటరి మహిళ, కొలనూర్ (ఓదెల)
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆసరా పెన్షన్ల పెంపుపైనే చర్చ జరుగుతోంది. గతంలో తమ కోసం ఏ ప్రభుత్వ కూడా ఈ విధంగా పెన్షన్లు ఇవ్వలేదని, కేసీఆర్ గతంలోనే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని, సమాజంలో నిరాదరణకు గురవుతున్న వారిని ఎందరినో ఈ పథకంలో చేర్చి ఆదుకున్నారని చర్చించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు 30-40 వేల మంది మాత్రమే ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు తాజా, గణాంకాల ప్రకారం 1,40,973 మందికి చేరుకున్నారు. వీరికి నెలకు రూ.30.78 కోట్లు లబ్ధి చేకూరుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్ధులు 33805, దివ్యాంగులు 10165, వితంతువులు 24554, నేతకార్మికులు 3718, గీతకార్మికులు 2363, ఒంటరి మహిళలు 1837, బీడీ కార్మికులు 43399, పైలేరియా బాధితులు 1004, కిడ్నీ బాధితులు 67 మంది ఉండగా, వీరికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.26.65 కోట్లు పంపిణీ చేస్తోంది. అంటే ఆసరా పెన్షన్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఇతర పార్టీలు ఇచ్చే హామీలను నమ్మబోమని, తమకు కేసీఆర్పైనే సంపూర్ణ విశ్వాసం ఉన్నదని ఆసరా పెన్షన్ల లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు.
నేను ఊరూరు తిరిగి ఒగ్గుకథలు చెప్పుకునేది. పదేండ్ల కింద ఓ ఊరిలో ఒగ్గుకథ చెప్పి రాత్రి ఇంటికొస్తుంటే లారీ గుద్దింది. ప్రమాదంల కుడికాలుకు బాగా దెబ్బతగిలింది. దవాఖానకు పోతే డాక్టర్లు సగం కాలు తీసేసిండ్రు. మంచాన పడ్డ. కథలు చెప్పుడు బంద్పెట్టిన. ఒకటే కాలుతో ఏ పనీ చెయ్యలేక పోతున్న. నాడు తిండిగింజలకు గోసయ్యింది. ఇద్దరు కొడుకులున్నా వాళ్లు కూడా ఒగ్గు కళాకారులే. వాళ్ల పరిస్థితి ఏమీ బాగాలేదు. తెలంగాణ సర్కారు వచ్చినంక దివ్యాంగుల పింఛను రూ.3016లు ఇస్తంది. అవే పొట్ట గడవడానికి ఆసరా అయితున్నయ్. ఇప్పుడు మళ్లీ వస్తే పింఛను రూ.6 వేలు చేత్తనంటున్నండు. సారే మాలాంటోళ్లకు దేవుడు. ఆయన వత్తె మా బతుకులకు భరోసా ఉంటదన్న ఆశతో ఉన్నం. మాలాంటోళ్ల బతుకులు మారాలంటే సారే మళ్లీ రావాలె.
-గొర్రె ఎల్లయ్య, నేరెళ్ల గ్రామం, తంగళ్లపల్లి మండలం
కేసీఆర్ ప్రభుత్వం నెలనెలా 4,016 ఫించన్ ఇవ్వడం దివ్యాంగులకు గొప్ప వరం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,500, రెండోసారి 3,016 ఇచ్చింది. కాగా దశాబ్ది ఉత్సవాల తర్వాత దివ్యాంగులకు పింఛన్ను రూ.4016దాకా పెంచారు. కన్నతండ్రి వలే కేసీఆర్ దివ్యాంగులను ఆదరిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే దివ్యాంగులకు పింఛన్ను రూ.6000కు పెంచుతామనడం అభినందనీయం. ప్రభుత్వ ఉద్యోగుల జీతం లాగా దివ్యాంగులకు నెలనెల రావడం ఆనందంగా ఉంది. దేశంలో ఇలా ఎక్కడా లేదని, అలాంటిది తెలంగాణలో ఇక్కడి బిడ్డగా దివ్యాంగుడినైన నేను తీసుకుంటున్న పింఛనే నిదర్శనం. రాష్ట్రంలోని దివ్యాంగులు తమ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఆదరించి, మళ్లీ గెలిపిస్తాం. బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని దివ్యాంగుల పక్షాన ప్రకటిస్తున్నా.
– గంగాధర్, అంబారిపేట సర్పంచ్ (జగిత్యాల రూరల్)
గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు గిట్ల ఫించన్లు ఇయ్యలేదు. ఎందరో ముఖ్యమంత్రులు అచ్చిండ్రు. పోయిండ్రు. గిట్ల పట్టిచ్చుకున్నోళ్లు ఎవ్వలు లేరు. సీఎం కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంకనే పింఛన్ డబ్బులు పెంచిండు. మా అసొంటి ముసలోల్ల గోస చూసిన సారు ఇప్పుడు ఏడాదికోసారి ఫించన్ పెంచుతానని చెప్పడం సంతోషంగా ఉన్నది. ఆయన వచ్చినంకనే పేదోళ్ల బతుకులు మారుతున్నయ్..మళ్లా సారే రావాలే. వచ్చే ఎన్నికలల్ల కారుగుర్తుకు ఓటేసి ఈ సర్కారునే తెచ్చుకుంటం.
– కొప్పుల మొగిలయ్య. కిష్టంపేట (కాల్వశ్రీరాంపూర్)