Vemulawada | వేములవాడ, జూన్ 14: వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. వేములవాడ రాజన్న ఆలయ వైభవాన్ని ఆది శ్రీనివాస్ తగ్గిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వేములవాడ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమ్మేళనం విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైందని చల్మెడ అన్నారు. అభివృద్ధిపై వాస్తవాలను జీవన్ రెడ్డి మాట్లాడితే జీవించుకోలేని ఆది శ్రీనివాస్ గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
అసలు ప్రాజెక్టులపై ఆది శ్రీనివాస్ కు అవగాహన ఉందా అని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు ఆది శ్రీనివాస్ అభివృద్ధిపై మసిపూసి మారేడు కాయ చూపినట్లుగా చేస్తున్నారే తప్ప 30 నెలల్లో ఒక్క పని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. స్వయంగా ఆయన గ్రామంలోనే ప్రారంభించిన 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోగా రెండు మాసాలుగా అర్ధాంతరంగా ఆగిపోయాయని అన్నారు. యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని నిర్మిస్తామని మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్ ఒక్కసారి యాదాద్రి వెళ్లి చూసి వస్తే బాగుంటుందని హితువు పలికారు. ప్రస్తుతం రాజన్న సన్నిధిలో జరుగుతున్న విస్తరణ పనులు వైభవాన్ని తగ్గించే విధంగా పనులు నడుస్తున్నాయని అన్నారు. రాతి కట్టడాలతో కాకుండా సిమెంటు, కంకర, స్టీల్ తో నిర్మాణాలు చేపడుతుండగా భక్తులు మనోవేదన గురవుతున్నారన్నారు.
బద్ది పోచమ్మ ఆలయ విస్తరణకు స్థలం సేకరించి నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం నత్తనడక నడుస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రారంభమై నడిచిన పనులనే 30 నెలలుగా కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న తీరే వారి పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రైతులు ఆరుగాలం పండించిన పంటలు ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ఉన్నాయని అన్నారు. ఆయన స్వగ్రామం రుద్రంగిలోనూ ఇప్పటికీ ధాన్యరాశులు కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నాయని విమర్శించారు. మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ స్వయంగా వెళ్లి రెండు వరుసల రహదారి పనులు ప్రారంభించామని చెబుతున్న చోట నిజమైన రైతు ప్రేమికులైతే ఓ ఎరువుల దుకాణం ప్రారంభించి ఉంటే తప్పకుండా రైతులకు మేలు జరిగేదని అన్నారు.
అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా అబద్ధాలు ఆడి ఇచ్చిన హామీలలో ఒకటైన నెరవేర్చారా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కో పథకాన్ని పక్కకు నెట్టుతూ అబద్దాలతో కాలం వెళ్ళదీస్తున్నారని ఎద్దేవ చేశారు. 114 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఎప్పటిలోగా లబ్ధిదారులకు ఇస్తారో తెలుపాలన్నారు. ఉద్యమకారులకు కూడా స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి వాటిని మరిచిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. కంటెంట్ లేకుండా మేధావిలా మాట్లాడుతున్నానని కవర్ చేస్తున్న ఆది శ్రీనివాస్ మంత్రి పదవి కోసమే ఆరాటం అన్నట్లుగా ఉందని విమర్శించారు.
ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని తప్పకుండా స్వాగతిస్తాము కానీ మంత్రి పదవి కోసమే ప్రజలను మోసం చేసే విధంగా మాట్లాడితే సహించరని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, సీనియర్ నాయకులు కందుల క్రాంతి కుమార్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, కొండ కనుకయ్య, నీలం శేఖర్, అంజద్ పాషా, మంత సందీప్, సుంకపాక రాజు, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాంబాబు, పెద్ది రాజు, పోతు అనిల్ కుమార్, సంజీవ్, హనుమంతు, ప్రేమ్ చారి, అసద్, లింగం రాకేష్, హరీష్, గోపి, సంతోష్, రావికంటి సాయి, సింగం ప్రసాద్, జీవన్ గౌడ్, నవీన్, శివరెడ్డి తదితరులు ఉన్నారు.