వేములవాడ టౌన్, మార్చి 10: అలవైకుంఠం ఇలకు దిగివచ్చినట్లుగా.. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అశేష భక్తజనం.. శివ పార్వతుల శివనామస్మరణ, వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శుక్రవారం ఆది దంపతుల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. రాజన్న ఆలయ అద్దాల మండపంలో అలంకరించిన పెళ్లి వేదికపై శివపార్వతులు పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు. తీర్థరాజ పూజతో ఈ కల్యాణ తంతు ప్రారంభమైంది. అనంతరం ఆలయ అర్చకులు ధ్వజారోహణం, వృషభేశ్వరుడికి కల్యాణం జరిపించిన అనంతరం శూలానికి ప్రత్యేక పూజలు చేశారు.
శుక్రవారం ఉదయం 11. 40 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు నమిలకొండ ఉమేశ్శర్మ ,ఈశ్వరగారి సురేశ్, ఉపప్రధానాచార్యులు చంద్రగరి శరత్, నమిలకొండ రాజేశ్వరశర్మ, గోపన్నగారి గణేశ్, ఒజ్జల ఆదిత్య, ఆస్థాన వేదపండితులు, అర్చకబృందం వివాహ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం తరఫున ఈవో కృష్ణప్రసాద్ దంపతులు, వేములవాడ మున్సిపల్ తరఫున చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు ఆదిదంపతులకు పట్టువస్ర్తాలు సమర్పించారు. గోపన్నగారి వసంత్-సరిత దంపతులు కన్యాదాతగా వ్యవహరించారు. సుమారు 50 వేల మందికిపైగా భక్తులు శివపార్వతులు తరలివచ్చి ఆది దంపతుల కల్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. కల్యాణం జరుగుతున్నంతసేపు శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ వారి భక్తిని చాటుకున్నారు. పరస్పరం జిలుకర బెల్లాన్ని ఉంచుకుని దేవుడికి సమర్పితులయ్యారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా అష్టావధాని తిగుళ్ళ శ్రీహరిశర్మ వ్యవహరించారు.
ఎదుక్కోళ్లతో మొదలు
ఉదయం 9 గంటలకు ఎదుర్కోళ్లతో ఆదిదంపతుల వివాహ తంతు ప్రారంభమైంది. ఆలయం ఎదుట ఈ ఘట్టం కన్నులపండువగా సాగింది. కట్నకానుకల సమయంలో శివుడి పక్షాన ఆలయ ఈవో కృష్ణప్రసాద్, పార్వతీదేవి తరఫున ఆలయ అర్చకులు వ్యవహరించారు. ఆలయంనుంచి తొలుత స్వామివారిని, అనంతరం పార్వతీదేవిని వేదమంత్రోచ్ఛారణాల మధ్య అర్చకులు, అధికారులు పల్లకీలో వేర్వేరుగా కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. స్వామివారికి కట్నంగా వెయ్యికోట్ల 16 వేలు ఇస్తున్నట్లు అమ్మవారి తరఫున ఉన్న వారు ఒప్పుకునే ఘట్టం ఆద్యంతం రసవత్తరంగా కొనసాగింది. కల్యాణానికి హాజరైన భక్తుల నుంచి కానుకలుగా 72 వేలు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
శరభ..శరభ నామస్మరణ
శివకల్యాణ మహోత్సవాల సందర్భంగా రాజన్న ఆలయంలో స్థానిక జంగమయ్యలు ఉగ్రరూపంతో శరభ చెప్పడం ఆనవాయితీ. శుక్రవారం రాత్రి జంగమయ్యలు శరభ నామస్మరణ చేశారు. శివపార్వతులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయిస్తున్న సమయంలో జంగమయ్యలు ఇలా శరభగజ్జెలు చెబుతూ వీరభద్రుడి వలె ఆలయంలోని ప్రతి మూలలో కొబ్బరికాయలు కొట్టారు. ఇక్కడ జంగమయ్యలు గణాచారి సాంబశివుడు, జంగం రాజేందర్, గొంగళ్ల రవికుమార్, గణాచారి రాజశేఖర్ పాల్గొన్నారు.
ఆదిదంపతుల పురవిహారం
రాత్రి పార్వతీ రాజరాజేశ్వరస్వామి, అమ్మవారు పెద్దసేవపై పురవిహారం చేశారు. అంతకుముందు ఉత్సవమూర్తులకు ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు పూజలు చేశారు. కల్యాణ దంపతులను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. మంగళహారతులు ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు.