తెలంగాణ చౌక్, నవంబర్ 29: జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంల పంపిణీ కార్యాక్రమాన్ని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి సందర్శించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 560 పోలింగ్ కేంద్రాల్లో 1700 మందికిపైగా భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లలోని ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని పోలింగ్ పూర్తయిన తరువాత తిరిగిపంపే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విధులునిర్వహించే ప్రిసైడింగ్ అధికారి అనుమతి లేనిది పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లరాదని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు, పోలింగ్ ఏజెంట్ల వద్ద అగ్గిపెట్టెలు, నీళ్లబాటిళ్లు, సెల్ఫోన్ తదితర వస్తువులు ఉండకుండా చూడాలన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, చంటిపిల్లల తల్లులు, ఓటు వేయడానికి వచ్చే సమయంలో వీలైనంత త్వరగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా అనుకోని ఘటనలు జరిగే అవకాశం ఉంటే వెంటనే మొబైల్ పార్టీకి సమాచారం అందించాలని సూచించారు. రూట్ మొబైల్ పార్టీలు ఈవీఎంలకు ఎస్కార్ట్గా ఉండి పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ స్టేషన్కు చేర్చి, తిరిగి పోలింగ్ పూర్తయిన తర్వాత తీసుకొని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అప్పగించే వరకు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలను కలుపుతూ ఉన్న రూట్లు, కేంద్రాల వద్ద గుంపులు ఉండకుండా చూడాలన్నారు. పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల 100 గజాల వరకు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు లేకుండా చూడాలని తెలిపారు. ఓటర్లను ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, జీపులు, కార్లలో తరలించకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉదయ్రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.