Siricilla | గాంధీచౌక్ : ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బూర్ల చంద్రశేఖర్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రాజన్న సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. 2021 ఏప్రిల్ 4న సిరిసిల్ల పట్టణంలోని భూపతి నగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను అదే కాలనీకి చెందిన నిందితుడు బూర్ల చంద్రశేఖర్ మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక ఏడుస్తూ బయటకు రావడంతో బాలిక తల్లి విచారించగా జరిగిన విషయాన్ని బాలిక తెలిపింది. దీంతో లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన బాలిక తల్లి సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా రూ.50 వేల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు ఎస్ఐలు నాయుడు, శ్రవణ్, కానిస్టేబుల్ జనార్దన్లను జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే అభినందించారు.