హుజూరాబాద్, డిసెంబర్ 30: మున్సిపల్ పరిధిలోని ఇప్పల్నర్సింగాపూర్లోని గాజోని కుంట లోకి నిండుగా నీరు చేరి జలకళను సంతరించు కుంది. ఒకప్పుడుగాజోని కుంట పేరుకు మాత్రమే కుంట. గత పాలకులు కుంటలో పేరుకు పోయినా తట్టెడు మట్టి కూడా తీయలేదు. శిథిలావస్థకు చేరుకున్న మత్తడికి మరమ్మతు చేయకపోవడం, కట్టపై, కుంటలో పెరిగిన పిచ్చి చెట్లను తొగించకపోవడంతో గాజోని కుంట తన రూపు రేఖలను కోల్పోయింది. వెరసి చిన్నపాటి వర్షం వచ్చి వరద చేరితే కుంట నిండి మత్తడి పోసేది. గట్టిగా నాలుగు రోజులు ఎండ కొడితే నీళ్లు ఎండిపోయి నెర్రలు బారి కనిపించేది. కుంట లోతు లేకపోవడంతో కళ్ల ముందే నీళ్లు వృథాగా పోతుండడంతో రైతులు తల్లడిల్లిపోయారు. జనవరి ఆరంభంలోనే ఆకుంట నెర్రెలు బారేది. అయితే మిషన్ కాకతీయతో గాజోనికుంటకు మహర్ధశ పట్టుకున్నది. కుంట అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు మిషన్ కాకతీయ-3లో రూ.22లక్షల నిధులు కేటాయించింది.
గత సంవత్సరం ఈ నిధులతో కట్టను వెడల్పు చేసి ఎత్తును ఫీట్ మేర పెంచారు. అదే విధంగా శిథిలావస్థలో ఉన్న కాకతీయుల కాలం లో నిర్మించిన మత్తడిని మరమ్మతు చేసి ధృడంగా చేయడంతోపాటుగా పిచ్చి చెట్లను తొలగించారు. కుంటలో పేరుకుపోయిన పూడికమట్టిని తొలగించారు. ఇప్పుడు గాజోని కుంటలో 80శాతం మేర నీళ్లు ఉండడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కుంటకు పునర్వైభవం రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇది ఒక గాజోనికుంట వ్యథ మాత్రమే కాదు. ఆయకట్టేతర గ్రామాలైన బోర్నపల్లి, తుమ్మనపల్లి, దమ్మక్కపేట, చిన్నపాపయ్యపల్లె పరిధిలో ఉన్న కుంట, చెరువులన్నింటి పరిస్థితి ఒకప్పుడు ఇలానే ఉండేది. మిషన్ కాకతీయలో అభివృద్ధి చేసిన తర్వాత ఒకటి అర తప్ప అన్ని కుంటలు ఇప్పుడు సగానికన్న ఎక్కువ నీళ్లతో కళకలాడుతున్నాయి.
మిషన్ కాకతీయతో మారిన పరిస్థితులు
కాకతీయ కాలువ కింద ఆయకట్టు కింద గ్రామాల పరిధిలో గల కుంటలు, చెరువులు ఎప్పుడు నీళ్లతో నిండుకుండను తలపిస్తాయి. ఎందుకంటే కాలువ ద్వార పొలాల మీదుగా వెళ్లే ఎక్కువైన నీళ్లు చెరువులకు జారడంతో అవి నడివేసవిలో కూడా కళకలాడుతున్నాయి. వీటికి భిన్నంగా ఆయకట్టేతర గ్రామాల పరిధిలో ఉన్న కుంట, చెరువులన్నింటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కేవలం వర్షం నీళ్ల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. మిషన్కాకతీయకు ముం దు గాజోనికుంట మాదిరిగానే మిగతా వాటి పరిస్థితి ఆద్వాన్నంగా ఉండేది. మిషన్కాకతీయలో అభివృద్ధి చేసిన తర్వాత ప్రతి వర్షపు నీటి బొట్టు ఒడిసిపడుతుండటంతో యాసంగి పంటలు కోతల పూర్తి వరకు సమృద్ధిగా నీళ్లు ఉంటుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బహుళ ప్రయోజనాలు
ఆయకట్టేతర గ్రామాల పరిధిలో ఉన్న కుంటలు, చెరువులన్నింటిని దాదాపుగా మిషన్కాకతీయలో అభివృద్ధి చేయడంతో బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ముఖ్యంగా గ్రామంలోని మత్స్య కార్మికులకు చాలా మేలు జరిగింది. చేప పిల్లలు పోసిన ఒకప్పుడు నీళ్లు తక్కువగా ఉంటుండడంతో పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో మత్స్య కారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుంటలో సమృద్ధిగా నీళ్లు నిలిచే అవకాశం ఉండడంతో చుట్టు పక్కల గల వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు పెరిగి సాగు నీటికి కొదువ లేకపోవడంతో రైతులు సంబురంగా ఉన్నారు. అదే విధంగా గొడ్డూగోదా, గొర్రెలు, మేకలకు తాగునీళ్లకు ఢోకా లేకపోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బావుల్లో పుష్కలంగా నీళ్లు
ఎప్పుడో తాతల కాలం నాడు తవ్విన గాజోని కుంట పూడిక మట్టి పేరుకపోవడంతో పాటుగా పిచ్చి మెక్కలు పెరగడంతో తన రూపు రేఖలను కోల్పోయింది. మిషన్కాకతీయలో అభివృద్ధి చేయడంతో కుంటలో నీళ్లు సంవృద్ధిగా ఉండటంతో బావులలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఈ సమయానికి కుంటలో మడుగులలో మాత్రమే నీళ్లు ఉండేవి.
గూడూరి జనార్దన్ రెడ్డి(రైతు)