వ్యవసాయ మార్కెట్లలో కార్యకలాపాలపై ఉన్న అనిశ్చితికి తెర
లైసెన్సులపై ప్రత్యేక పరిశీలన
ప్రతి నెలా పర్చేజ్ రిటర్నులు సమర్పించేలా చర్యలు
ఆదాయం పెంపుపై అధికారుల కసరత్తు
ముకరంపుర, ఫిబ్రవరి 9: వ్యవసాయ మార్కెట్లలో ప్రతి వ్యవహారాన్ని పారదర్శకంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే క్రయవిక్రయాలతో పాటు మార్కెట్ కమిటీల్లో జరిగే ప్రతీ అంశాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కొంత కాలంగా వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలపై ఉన్న అనిశ్చితికి తెరపడింది. దీంతో మార్కెట్లను తిరిగి యథాతధంగా గాడిలోకి తేవడం, రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆదాయాన్ని పెంపొందించుకోవడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.
మార్కెట్లకు పూర్వవైభవం తెచ్చేలా..
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు కొంత కాలంగా ఆశించిన స్థాయిలో ఆదాయం లేక డీలా పడ్డాయి. ఏ పని చేయాలన్నా ఆర్థిక తడబాటుతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మార్కెట్లకు తిరిగి పూర్వవైభవం తెచ్చే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కొన్నాళ్లుగా మార్కెట్లలో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ యాసంగి సీజన్ నుంచి యార్డుల్లో కొనుగోళ్లలో జోరు పెంచే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మార్కెట్ ఫీజు విషయంలోనూ పకడ్బందీగా వ్యవహరించే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
లైసెన్సులపై ప్రత్యేక దృష్టి
రైతుల నుంచి వ్యవసాయోత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులంతా మార్కెటింగ్ శాఖ నుంచి తప్పనిసరిగా లైసెన్సు పొంది ఉండాలి. నిర్ణీత కాల వ్యవధిలో తిరిగి పునరుద్ధరణ చేయించుకోవాలి. లైసెన్సులపై ఉదాసీన వైఖరి కనబరుస్తుండడాన్ని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మార్కెట్ కమిటీల వారీగా లైసెన్సుల పరిశీలనకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశాయి. లైసెన్సులు లేకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న కొన్ని మిల్లులను గుర్తించారు. ఇక లైసెన్సులు కలిగి ఉన్న వారు గడువులోగా పునరుద్ధరణ చేసుకోవాలంటూ ఇప్పటికే సమాచారాన్ని ఇచ్చారు.
పదిలోగా పర్చేజ్ రిటర్న్లు సమర్పించాల్సిందే
వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్ల వివరాలను వ్యాపారులు ఇక ఎప్పటికప్పుడు పర్చేజ్ రిటర్న్ల రూపంలో సంబంధిత మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో సమర్పించాలి. మార్కెట్ ఫీజు వసూలుకు పర్చేజ్ రిటర్న్లే ప్రధాన ఆధారం. గతంలో మాదిరిగా కాకుండా ఇక నుంచి ప్రతి నెలా 10వ తేదీలోగా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
మార్కెట్లలో పారదర్శకంగా సేవలు
మార్కెట్లలో పారదర్శకంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయోత్పత్తులు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ లైసెన్సు కలిగి ఉండాలి. జిల్లాలో ఇప్పటికే చేపట్టిన తనిఖీల్లో లైసెన్సులేని పలు మిల్లులను గుర్తించాం. వారందరికీ నోటీసులిస్తాం.
– పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి