Kaleshwaram Project | సాగు, తాగు నీటికి దశాబ్దాల పాటు తండ్లాడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వరాష్ట్రంలో అపరభగీరథుడు సీఎం కేసీఆర్ చేపట్టిన జలయజ్ఞంతో జలకేతనం ఎగరేసింది. రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చే క్రమంలో తొలి అడుగు ఈ ప్రాంతం నుంచే పడగా, గోదావరినదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సజీవధారగా మారింది. ఇంకో అడుగు ముందుకేసి దానికి అనుబంధంగా చేపట్టిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కరువునేలకు కల్పవల్లిగా మారింది. మరోవైపు సిరిసిల్లలోని ఎస్సారార్ జలాశయం రాష్ర్టానికే నీటి జంక్షన్గా మారి నలుదశలా పరవళ్లు తొక్కుతుండగా, చివరి మడికీ పుష్కలంగా నీరందుతున్నది. మొత్తంగా తొమ్మిదేండ్లలో సస్యశ్యామలంగా మారి, రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నమస్తే అందిస్తున్న ప్రత్యేక కథనం.
కరీంనగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా వరదాయినిగా ఉన్న ఎస్సారెస్పీ ప్రాజెక్టు క్రమంగా వట్టిపోయింది. 16 లక్షల ఎకరాలకు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో 9 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు నిర్దేశించబడి నిర్మించిన ఈ ప్రాజెక్టు క్రమంగా తన సామర్థ్యాన్ని కోల్పోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. దీనికి తోడు సమైక్య పాలకుల పట్టింపులేని తనం వల్ల దాదాపు లక్షన్నర ఎకరాలకు సాగునీరందించే చెరువులు చావుకు దగ్గరయ్యాయి.
అటు సాగునీటి సౌకర్యాలు లేక, ఇటు చెరువులు బాగుకు నోచుకోక, భూగర్భజలాలు అడుగంటిన పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో స్వరాష్ట్రం ఏర్పడడంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగునీటి వనరుల పెంపు కార్యక్రమం మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టును ఆధారం చేసుకొని, రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన వరద కాలువను అనుసంధానం చేసుకొని రూ.1299 కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టి రెండేండ్లలోనే పూర్తిచేశారు.
అలాగే వరద కాలువకు తూములు పెట్టి వేలాది చెరువులను నింపుకునే అవకాశం కల్పించారు. దీంతో వరద కాలువ దిగువన ఒక జగిత్యాల జిల్లాలోనే లక్షన్నర ఎకరాల సాగుభూమి స్థిరీకరణ జరిగింది. ఇక వరద కాలువ-కాకతీయ కాలువ మధ్య సైతం లింక్ కాలువను నిర్మించారు. ఎస్సారెస్పీలో నీటి నిల్వ లేని సమయంలో కాకతీయ కాలువ దిగువన ఉన్న ఆయకట్టుకు నీరందించేందుకు వరద కాలువ నుంచి నీటిని కాకతీయ కాలువలోకి మళ్లించేందుకు జగిత్యాల జిల్లా తాటిపెల్లి-కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి మధ్య మూడు కిలోమీటర్ల పొడవున 3వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో లింక్ కెనాల్ను పూర్తి చేశారు. ఈ ఏడాది యాసంగి నుంచే కాకతీయ కాలువ ఆయకట్టుకు నీటిని ఇవ్వడం మొదలు పెట్టారు.
దీంతో కాకతీయ కాలువ కింద దాదాపు 30 డిస్టిబ్యూటరీల పరిధిలోని దాదాపు 2.50లక్షల ఎకరాల ఆయకట్టుకు మేలు జరిగింది. ఇక రూ.135 కోట్ల వ్యయంతో నిర్మించిన రోళ్లవాగు ప్రాజెక్టు వల్ల జగిత్యాల-ధర్మపురి నియోజకవర్గాల్లోని 20 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచుకుంది. ఎస్సారార్ రిజర్వాయర్, ఎల్లంపల్లి కాలువలు, నారాయణపూర్ రిజర్వాయర్లతో లక్షలాది ఎకరాలకు సాగు నీరందుతున్నది. సిరిసిల్లలోని ఎస్సారార్ జలాశయంతోపాటు రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ కాలువల ద్వారా రాజన్న సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది. ఇంకా ఎస్సారార్ రిజర్వాయర్కు అనుసంధానంగా కోనరావుపేటలో మల్కపేట రిజర్వాయర్ నిర్మించడం, త్వరలోనే అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తుండడం మరింత భరోసానిస్తున్నది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో చేపట్టిన చర్యల వల్ల నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాటర్ హబ్గా.. సేద్యఖిల్లాగా దేశంలోనే పేరు ప్రఖ్యాతలు పొందింది.
పైపైకి భూగర్భజలాలు
సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగిన వ్యవసాయ విధ్వంసంతో సేద్యనీటి రంగం పూర్తిగా అగమ్యగోచరంగా తయారైంది. ప్రాజెక్టులు పూడుకుపోయి జలకళ తప్పగా, చెరువులు వట్టిపోవడంతో భూగర్భజలాలు సైతం అడుగంటిపోయిన దుస్థితి. రాష్ట్రం ఏర్పడిన రోజున జిల్లాలో సగటున 12.33 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, కాళేశ్వర జలాల పరవళ్లు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరద కాలువకు తూములు పెట్టి చెరువులు నింపడం, ఎస్సారెస్పీ డిస్టిబ్యూటరీల ద్వారా చెరువులను నింపడం, ఏడాది పొడవునా వరద కాలువ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మారిపోవడం, మిషన్ కాకతీయ కింద చెరువులకు జీవపోయడంతో భూగర్భజలాలు అమాంతంగా పొంగివచ్చాయి. జిల్లాలో ఎక్కడ చూసిన ప్రస్తుతం సగటున 5.5 మీటర్ల లోతులోనే జలసవ్వడులు వినిపిస్తున్నాయి.
137 శాతం పెరిగిన సాగు విస్తీర్ణం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14,54,569 ఎకరాల భూమి సాగుకు ఆమోదయోగ్యంగా ఉంది. అయితే 2014కు ముందు ఉన్న పరిస్థితులు, సాగునీటి వనరుల వల్ల కేవలం 6,65,255 ఎకరాలు అంటే కేవలం 45.73 శాతం మాత్రమే సాగయ్యేది. మరో 55 శాతం భూమి పడావు పడిపోయింది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం చేపటిన భగీరథ ప్రయత్నం వల్ల జిల్లాలోని నలుమూలలకు గోదావరి జలాలు తరలివచ్చాయి. దీంతో ఈ దశాబ్దకాలంలో సాగుభూమి పెరుగుదలలో ఘననీయమైన ప్రగతి నమోదైంది. ప్రస్తుతం జిల్లాలో కాళేశ్వరం జలాలు రావడం వల్ల 7,27,968 ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వచ్చింది. రాష్ట్రం వచ్చేనాటికి ఉన్న సాగు విస్తీర్ణం ఇప్పుడు దాదాపు 137 శాతం అధికంగా పెరిగిపోయింది. ఇక 2014లో జిల్లాలో కేవలం 4,57,725 మంది రైతులు సేద్యం చేస్తుండగా, ప్రస్తుతం 7,08,965 మంది ఎవుసం చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తొమ్మిదేండ్లలో జిల్లాలో రెండున్నర లక్షల మంది రైతుల సంఖ్య ఏకంగా 64.5 శాతం పెరుగడం వ్వవసాయ ప్రగతికి అద్దం పడుతోంది.
సాగునీటి గోస తీరింది
రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ కృషితో నీటి కష్టాలు తప్పినయి. ఎస్సారెస్పీ ఆయకట్టేతర ప్రాంతమైన మా గ్రామానికి వరద కాలువ వల్ల తాగు, సాగు నీటి గోస తీరింది. వరద కాలువ నుంచి నీళ్లు ఇయ్యడంతో చెరువులు నిండి, బావుల్లో సైతం భూగర్భ జలాలు పెరిగినయి. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఐతుపల్లిలో వర్షాలే ఆధారం. వరద కాలువ నుంచి ఐతుపల్లిలోని పెద్ద చెరువు, రాళ్ల చెరువులోకి నీళ్లు వస్తుండడంతో ఇప్పుడు ఊర్ల రెండు పంటలు పండుతున్నయి. పదేళ్ల కింద మా ఊళ్లో భూమికి ఎకరానికి 2 లక్షలకు ధర ఉంటే, ఇప్పుడు ఎకరం 20 లక్షలు దాటింది. కరువులో ఉన్నప్పుడు మా రైతులు భూములు బాగా అమ్ముకున్నరు. ఇప్పుడు రెండు పంటలకు నీళ్లు వస్తుండడంతో అందరు ఉన్న కాడికి వ్యవసాయం చేసుకుంటున్నరు. ఇగ భూములు ఎవ్వరు అమ్మడం లేదు. సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ సార్ రైతులకు చేస్తున్న మేలు మరువలేనిది.
– పలుమారు అంజయ్య, రైతు (ఐతుపల్లి)
గిప్పుడు ఎవుసం మంచిగున్నది
నాకు మూడెకరాల భూమి సిద్దిపేట రోడ్డులోని వ్యవసాయ కాలేజీ వద్ద ఉండేది. తెలంగాణ రాక ముందు పెద్ద కరువును జూసినం. సాగునీరు లేక నాలుగు బోర్లు వేసిన. 600ల ఫీట్లు ఏసినా కొన్ని నీళ్లే పడ్డయి. 30 గుంటల్లో వరి సాగు జేత్తే 6గంటల కరెంటు వత్తుండే. అది లోవోల్టేజీ కరెంటే. నీళ్లు ఇగ్గక పోతే రెండు కెపాసిటర్లు, రెండు స్టార్టర్లు పెట్టిన. అయినా మడి పారేది కాదు. దిగుబడి వచ్చిన వడ్లను తీసుకొని షావుకారి దగ్గరకు పోతే కుంచెతో కొలుస్తుండే. మొదటి కుంచె లాభం కింద తీసుకునేది. క్వింటాలుకు రూ. వెయ్యి మార్కెట్లో ఉంటే షావుకారు 700లే కట్టిత్తుండే. చేతిలో పైసలు కూడా లేవు. ఒక్కటే అంగి, ఒక్కటే ధోతితో ఎల్లదీసినం. ఎవుసం నడవక ఉన్న మూడెకరాలు అమ్ముకుని ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు జేసిన. తెలంగాణ వచ్చినంక రంగనాయక సాగర్ నీళ్లు మాఊరికొచ్చినయి. వాగుల్లో చెక్డ్యాంలు కట్టిన్రు. మస్తు నీళ్లున్నయి. బోర్లతో 200 ఫీట్లకే నీళ్లు ఉరికొత్తున్నయి. ఉన్న పొలం ఎద్దుకమ్ముకుంటిరా భగవంతుడా అని బాధపడుతున్న. ఊళ్లనే ఉన్న నాలుగు ఎకరాల మా సుట్టాల భూమిని కౌలుకు తీసుకుని వడ్లు పండిత్తున్న. ఎకరాన 30క్వింటాళ్ల వడ్లచ్చినయి. సర్కారే మద్దతు ధరకు కొంటుందాయే. చేతిలో నాలుగు పైసలు కనిపిస్తున్నయి. బట్టకు, పొట్టకు రందీలేకుంట ఉన్నం. కేసీఆర్ జెయ్యవట్టి మాలాంటి రైతులకు ఎన్నటికీ ఢోకా లేదు. ఇపుడు వ్యవసాయం లాభసాటిగున్నది.
– కొమ్మిటి యాదిరెడ్డి, రైతు, జిల్లెల్ల (తంగళ్లపల్లి మండలం)