కరీం‘నగరం’ ఉలిక్కిపడింది. ఇందిరానగర్, ఆదర్శనగర్ మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్నిప్రమాదం భయపెట్టింది. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి కూలి పనిచేసుకొని బతికే పేదల గుడిసెలను బుగ్గిపాలు చేసింది. అదృష్టవశాత్తూ బాధితులంతా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. ఓవైపు మంటలు ఎగిసిపడడం, మరోవైపు సిలిండర్లు పేలడం చూసి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వణికిపోగా, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.
కరీంనగర్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)/రాంనగర్: నగరంలోని ఇందిరానగర్, ఆదర్శనగర్ మధ్యన ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని అద్దెకు తీసుకుని కొందరు వలస కూలీలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. 20 నుంచి 25 ఏండ్లుగా వీళ్లు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని భవన నిర్మాణాలకు మట్టిపనులు చేస్తున్నారు. సుమారు 30గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వీరు మంగళవారం సమ్మక్క, సారలమ్మ జాతర కోసం మేడారం వెళ్లారు. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి 21గుడిసెల వరకు కాలి బూడిదయ్యాయి. అందులో ఉన్న కూలీల నిత్యావసరాలు, బట్టలు, నగలు, నగదు కూడా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి కారణం ఇదమిద్దంగా తెలియకపోయినా.. ఏదో ఒక గుడిసెలో దేవుడి ఫొటో వద్ద వెలిగించిన దీపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంలో మూడు బైక్లు కూడా దగ్ధమైనట్లు చెబుతున్నారు. మొత్తంగా 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
అగ్ని ప్రమాదం జరిగిన చోట గంట పాటు తీవ్రమైన భయాందోళన నెలకొన్నది. చెలరేగుతున్న మంటలను చూసి స్థానికులు వణికిపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారులు రంగంలోకి దిగారు. అగ్ని మాపక అధికారి తగరం వెంకన్న స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. సిబ్బంది ఫైర్ సేఫ్టీ ద్వారా మంటలను గంటలోనే పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఒక దశలో మంటలను ఆర్పేందుకు కష్టం కావడంతో జగిత్యాల ఫైర్ యూనిట్లను కూడా పిలిపించారు.
గుడిసెల్లో ఒకదాని వెనుక మరొకటి ఎనిమిది సిలిండర్లు పేలగా, మిగతా సిలిండర్లు పేలకుండా జాగ్రత్తపడ్డారు. గుడిసెలను చుట్టుముట్టిన మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తీవ్ర ప్రయత్నాలు చేశారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ట్యాంకర్లకు మోటర్లు బిగించి మంటలను అదుపు చేయగలిగారు. మరో తొమ్మిది గుడిసెలకు మంట అంటకుండా నిలువరించారు. గుడిసెలు దగ్ధమైన ప్రదేశానికి అతి చేరువలో రెనే ప్రైవేట్ దవాఖాన ఉండడంతో ఇటు వైపు మంటలు రాకుండా చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ త్రీటౌన్ సీఐ శ్రీనివాస్తోపాటు మున్సిపల్, రెవెన్యూ అధికారులు అకడికి చేరుకుని సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చూపిన తెగువను కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు.