పెగడపల్లి, మార్చి 3 : ఒక్క జాబ్ సాధించాలంటేనే అష్టకష్టాలు పడుతున్న ఈ రోజుల్లో పేద రైతుకూలీ బిడ్డ మమత ఏకంగా ఐదు ఉద్యోగాలకు ఎంపికైంది. తల్లిదండ్రులు పుప్పాల భూమయ్య, రమది పేద కుటుంబమే అయినా ఆమె మాత్రం వరుసగా జాబ్స్ సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. పెగడపల్లి మండలం ల్యాగలమర్రికి చెందిన ఆమె, పీజీ ఉస్మానియాలో, బీఈడీ శాతవాహన యూనివర్సిటీలో పూర్తి చేసింది. ప్రస్తుతం సిరిసిల్లలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మూడేళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నది.
2023 ఆగస్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరైంది. ప్రస్తుతం విడుదలైన గురుకుల ఫలితాల్లో అత్యంత ప్రతిభ చూపి ఏకంగా ఐదు ఉద్యోగాలకు ఎంపికైంది. కామర్స్ విభాగంలో డిగ్రీ లెక్చరల్ ఉద్యోగానికి రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్ సాధించగా, కామర్స్ విభాగంలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించింది. మున్సిపల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగానికి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్, బాసర జోన్లో ఒకటో ర్యాంక్లో నిలిచింది. అలాగే, సోషల్ విభాగంలో పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు మమత ఎంపికైంది.