సాగునీటి కోసం మంథని ప్రాంత రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఎర్రటి ఎండలో నాలుగు గంటలకుపైగా మంథనిలో ఆందోళన చేశారు. పురుగుల మందు డబ్బాలు, ఎండిన వరిని పట్టుకొని నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చివరకు పోలీస్ అధికారుల హామీతో శాంతించారు.
మంథని, మార్చి 14: సాగునీరందించి పంటలను కాపాడాలని ఈ నెల 7న మంథని మండలం సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, ముత్తారం మండలం రామకృష్టాపూర్, గంగాపురి గ్రామాల రైతులు మంథనిలోని బొక్కలవాగు వంతెన సమీపంలో పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఆర్డీవో హనుమానాయక్ అక్కడికి చేరుకొని రెండు రోజుల్లో కాలువలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. అయితే వారందాటినా నీరందకపోవడం, పంటలు ఎండుతుండడంతో మంథని ప్రాంత రైతులు మళ్లీ రోడ్డెక్కారు. గురువారం పెద్దపల్లి- కాటారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పురుగుల మందు డబ్బాలు, ఎండిన వరిని చేత పట్టుకొని బైఠాయించారు. ఇదివరకే నీరందిస్తామని అధికారులు హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ నీటి గోస రాలేదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన వెంటనే కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సాగునీరందించే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ఎర్రటి ఎండలో నాలుగు గంటలకుపైగా ఆందోళన చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలిసి ఆర్డీవో హనుమానాయక్, ఈఈ బలరాంనాయక్ అక్కడకు చేరుకొని రైతులను శాంతింపజేసేందుకు విఫలయత్నం చేశారు. గతంలో నీళ్లు ఇస్తామని మోసం చేశారంటూ రైతులు నిలదీశారు. కాగా, గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు. సాగునీటి సమస్యను కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేయించారు.
తెలంగాణ అచ్చినకాడి నుంచి ప్రభుత్వం మంచిగా సాగునీరిచ్చింది. తొమ్మిదేండ్లలో ఎన్నడూ నీళ్లులేక పంటలు ఎండిపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ సాగు కష్టాలు మొదలైనయి. ఎంతో ఆశతో వరి వేసుకొన్నం. కానీ కండ్ల ముందటే ఎండిపోతుంటే మస్తు బాధనిపిత్తుంది. మొన్న తొమ్మిదో తారీకే నీళ్లు వస్తయని అధికారులు చెప్పి వారం దాటినా నీటి చుక్క కూడా రాలేదు. సార్లు దయతలిచి వెంటనే నీరందించి పంటలను కాపాడాలె. లేకుంటే కాలబెట్టుడే దిక్కయితది.
– కోరవేన శ్రీనివాస్, రైతు, సూరయ్యపల్లి (మంథని)