వారు అక్షరం తెలియని అమాయకులు.. సొంత ఇండ్లు గానీ, ఎలాంటి ఆస్తిపాస్తులు గానీ లేవు. రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతికే జీవితాలు.. పొద్దున లేస్తే చాలు ఎక్కడ పనిదొరుకుతుందా..? అని వెంపర్లాడే కష్టజీవులు. రెక్కాడితే గానీ డొక్కాడని దుర్భరమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న నిస్సహాయులు పిట్టలోళ్లు. సంచార జాతుల్లో ఒకటైన వీరు కులధ్రువీకరణ పత్రాల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నా నాటి పాలకులు పట్టించుకోలేదు. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, తదితర రంగాల్లో అన్ని రకాలుగా నష్టపోతున్నా అప్పటి ప్రభుత్వాలూ పరిష్కారం చూపలేదు. కానీ, నాలుగు దశాబ్దాల తర్వాత ఆ కులస్తుల కల నెరవేరింది. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కృషి, తహసీల్దార్ సత్యనారాయణ ప్రత్యేక చొరవతో ఎస్టీలుగా గుర్తింపు దక్కింది. నాలుగు రోజుల క్రితమే 20 మందికి కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయగా, ఆ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ అనామకుల్లా మిగిలిపోయిన తమకు ఓ గుర్తింపు వచ్చిందని, ఇకపై ప్రభుత్వాల నుంచి అన్ని పథకాలూ వర్తిస్తాయని, తమ పిల్లలు బాగుపడుతారని సంబురపడుతున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, తహసీల్దార్ సత్యనారాయణకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
మెట్పల్లి, జనవరి 28: పిట్టలోళ్లు సుమారు 40 ఏళ్ల కింద వివిధ ప్రాంతాల నుంచి మెట్పల్లికి వలస వచ్చారు. పట్టణంలోని 6, 22వ వార్డుల్లో అక్కడక్కడ ప్రభుత్వ, ఎస్సారెస్పీ స్థలాల్లో తాత్కాలిక షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఏ పని దొరికితే ఆ పని చేసుకొని జీవిస్తున్నారు. మక్క కంకులు కాల్చి విక్రయించడం, వ్యవసాయ కూలి పనులకు వెళ్లడం, పాత ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ (స్క్రాప్)ను సేకరించి విక్రయించడం, ఇంకొందరు అడవులకు వెళ్లి కుందేళ్లు, పక్షులు, తదితర వాటిని వేటాడి తెచ్చి విక్రయించడం చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల చాలా రకాలుగా నష్టపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేకపోతున్నారు. నెల క్రితం ఈ విషయాన్ని ఆయా వార్డుల కౌన్సిలర్లు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన పిట్టలోళ్లకు న్యాయం జరిగేలా చూడాలని తహసీల్దార్ సత్యనారాయణకు సూచించారు. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో విచారణ చేశారు. వారి నివాసాల వద్దకు వెళ్లి జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలపై పూర్తి వివరాలను సేకరించారు. సంచార జాతుల్లో ఒకటైన పిట్టలోళ్లు ఎస్టీ జాబితాలోని నక్కల-32 (పిట్టల, గువ్వల) అనే తెగలో భాగమని గుర్తించారు. ఎస్టీ జాబితా కింద వీరిని చేర్చి, కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చేతుల మీదుగా ఈ నెల 25న మొదటి విడుతగా 20 మందికి కుల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
పేరుకు పిట్టలోళ్లు. సంచార జాతిలో ఒకరు. వారికి ఇన్నాళ్లూ కనీసం కులధ్రువీకరణ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలలోని ఏ జాబితాలోకి వస్తారో తెలియదు. ఎన్నో ప్రభుత్వాలు మారినా పరిష్కారం దొరకలేదు. ఏ గుర్తింపూ లేక దశాబ్దాలుగా దుర్భరమైన పరిస్థితుల్లో బతుకులు వెళ్లదీసినా ఎవరూ గోడు వినిపించుకోలేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న వారికి ప్రభుత్వాల నుంచి కనీస సాయమందలేదు. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, తదితర రంగాల్లో అన్ని రకాలుగా నష్టపోయినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, స్వరాష్ట్రంలో ఆ కులస్తుల కల నెరవేరింది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ప్రత్యేక చొరవ, మెట్పల్లి తహసీల్దార్ సత్యనారాయణ కృషితో ఎస్టీలుగా గుర్తింపు దక్కింది. నాలుగు రోజుల క్రితమే కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయగా, ఆ కులస్తులు హర్షం వ్యక్తమవుతున్నది.
మాకో గుర్తింపు వచ్చింది
ఆడోళ్లు, మొగోళ్లం కష్టపడుతం. కూలీ నాలీ పనిచేసుకుంటూ వచ్చేదాంట్లకెళ్లి పిల్లలను సాదుకుంట బతుకుతున్నం. ఏ కులం సర్టిఫికెట్ లేక చాలా నష్టపోయినం. కులం సర్టిఫికెట్ ఇవ్వాలని ఎన్నో ఏండ్ల సంది పెద్ద పెద్దోళ్ల దగ్గర మొరపెట్టుకున్నం. కానీ, ఎవరూ పట్టించుకోలె. ఇప్పుడు మాకు ఎస్టీ కింద సర్టిఫికెట్ వచ్చింది. మా కోరిక నెరవేరింది. మాకు ఒక గుర్తింపు దొరికినట్లయింది. చానా ఆనందంగా ఉంది.
– ఆరేళ్ల రాములు, పిట్టల సామాజిక వర్గం సభ్యుడు (మెట్పల్లి)
150 కుటుంబాలకు ప్రయోజనం
నక్కల-32(ఎస్టీ) కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వల్ల మెట్పల్లి పట్టణంలోని 150 మంది పిట్టలోళ్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగనున్నది. వీరంతా ఇకపై ఒకే చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశముంటుంది. స్కూళ్లు, కాలేజీల్లో రిజర్వేషన్తో సీట్లు, మంచిగా చదువుకుంటే రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పొందవచ్చు. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందవచ్చు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు, కల్యాణలక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూరుతుంది. వీటితో పాటు సామాజిక భద్రత కలుగుతుంది.
రుణపడి ఉంటం
ఇన్ని రోజులు కులం సర్టిఫికెట్ లేక పిల్లగాండ్ల సుదువు ఆగమైంది. సర్కారు సాయానికి దూరమైనం. పథకాలు అందలె. ఏండ్ల సంది బాధపడ్డం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలె. ఇప్పుడు ఎమ్మెల్యే సారు, తహసీల్దార్ సారు దయవల్ల మాకు సర్టిఫికెట్లు అచ్చినయ్. మస్తు సంతోషం అయితున్నది. మమ్మల్ని గుర్తించి న్యాయం చేసిన సార్లకు రుణపడి ఉంటం.
– ఆరేళ్ల జగావంతి, పిట్టల సామాజిక వర్గం సభ్యురాలు (మెట్పల్లి)
జీవన విధానంలో మార్పు
కుల ధ్రువీకరణ పత్రాలతో పిట్టల సామాజిక వర్గం జీవన విధానంలో మార్పు వస్తుంది. ఇంత కాలం వారికి ఎలాంటి కుల సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, తదితర రంగాల్లో ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. ఇక్కడి ప్రాంతానికి చెందిన పిట్టలోళ్లుగా పిలువబడే వీరి స్థితిగతులు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇటీవల పిట్టలోళ్లకు కుల ధ్రువీకరణ పత్రం లేదని అంశం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వెళ్లగా, వారి ఆదేశాలతో క్షేత్ర స్థాయికి వెళ్లాం. వారి జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలను వారి సంఘం పెద్దమనుషులు, అదే విధంగా ఇది వరకు ఎస్టీ సర్టిఫికెట్ పొందిన వివిధ ప్రాంతాల్లోని వారి చుట్టాలు, బంధువుల ద్వారా వివరాలు సేకరించాం. వీరి ఆచార వ్యవహారాలు షెడ్యూల్ తెగలలో భాగమైన నక్కల (పిట్టల, గువ్వల సంచార జాతులు)లోని నిబంధనలకు సరితూగడంతో ఎస్టీలుగా గుర్తించాం. 150 కుటుంబాలకు నక్కల (ఎస్టీ-32) సర్టిఫికెట్లను జారీ చేయాలని నిర్ణయించాం. మొదటి విడుతగా 20 మందికి అందించాం. త్వరలోనే మిగతా వారికి జారీ చేస్తాం. కుల ధ్రువీకరణ పత్రం పొందడం వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో, సబ్సిడీ రుణాలు, కల్యాణలక్ష్మి వంటి అనేక పథకాల్లో ప్రయోజనం పొందవచ్చు.
– సత్యనారాయణ, తహసీల్దార్ (మెట్పల్లి)