అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతివలే అంతిమ నిర్ణేతలు కానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చైతన్యం చూపారు. పురుషుల కంటే ఎక్కువగా 93,874 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక రామగుండం నియోజకవర్గం మినహా మిగతా అన్ని చోట్లా వారే అధికంగా ఓటు వేయడంతో ఈ ఫలితాల్లో మహిళలే కీలకం కాబోతున్నారు.
– కరీంనగర్, డిసెంబర్ 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు చైతన్యం చూపారు. ఈ నెల 30న జరిగిన పోలింగ్లో తమ సత్తా చాటారు. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన పన్నెండు నియోజకవర్గాల్లో మహిళలే అత్యధికంగా ఓటు వేశారు. 13 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 31,78,980 మంది ఉండగా, అందులో 15,59,780 మంది పురుషులు, 16.19,038 మంది మహిళలు ఉన్నారు.
అంటే పురుషుల కన్నా 59,258 మంది ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 24,56,146 మంది ఓటు (77.26 శాతం) హక్కును వినియోగించుకోగా, అందులో పురుషులు 11,81,999 మంది, మహిళలు 12,74,065ఓటు వేశారు. ఈ లెక్కన 93,874 మంది మహిళలే ఎక్కువగా ఓటువేసి తమ చైతన్యాన్ని చాటుకున్నారు. అయితే అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉన్న నేపథ్యంలో మహిళా ఓట్లే కీలకంగా మారే అవకాశం ఉన్నది. వీళ్లే అంతిమ నిర్ణేతలు అవుతారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.