హుజూరాబాద్/హుజూరాబాద్ చౌరస్తా, అక్టోబర్ 26: ‘ కాంగ్రెస్, బీజేపీలు తమ 70ఏండ్ల పాలనలో దళితులను ఏనాడూ పట్టించుకోలే. అభ్యున్నతికి పాటుపడలే. సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన్రు. దూరం పెట్టిన్రు. ఇన్నేండ్లకు సీఎం కేసీఆర్ ఓ గొప్ప పథకం దళిత బంధును తెస్తే బీజేపోళ్లు అడ్డుకుంటున్నరు. వాళ్లు చేయరు. చేసేటోళ్లను చేయనియ్యరు. ఆ పార్టీతో ధరల భారం తప్ప ప్రజలకు రూపాయి లాభం లేదు..? అందరినీ ఆగం చేస్తున్నరు. ఈ ఎన్నికలో బీజేపీకి గుణపాఠం చెప్పాలి’ అని మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని సూపర్బజార్ రోడ్డులో ధూంధాం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాటా ఆకట్టుకోగా, జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఇన్నేండ్లలో దళితుల కోసం ఏమైనా చేశాయా అని ప్రశ్నించారు. ఇన్నేండ్ల తర్వాత దళితుల కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెస్తే అడ్డుకుంటున్నరని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసి పథకానికి ఆపించారని ధ్వజమెత్తారు. వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా హుజూరాబాద్లో గెలిచేది టీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. దళిత బంధును తీసుకువచ్చిన టీఆర్ఎస్ కావాలా.. అడ్డుతగిలిన బీజేపీ కావాలా..? ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్యాదవ్కు భారీ మెజార్టీ అందించాలని కోరారు.
దళితులను ఆదుకున్నది సీఎం కేసీఆరే: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లలో దళితుల బాగు కోసం ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నరు. దళితబంధు పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10లక్షల సాయం చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషిచేస్తున్నరు. గత సమైక్య పాలనలో కార్పొరేషన్ల లోన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన సందర్భాలుండేవి. ఇప్పుడు దళితబంధుతో ఎలాంటి షరతులు లేకుండా.. మళ్లీ కట్టనవసరం లేకుండా రూ.10లక్షలు ఇవ్వడం దళితులపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును మంత్రి గంగుల సత్కరించారు. అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఉన్నారు.
ఆందోళన వద్దు.. దళితబంధు వస్తది: విప్ గువ్వల బాలరాజు
దళితులు ఆందోళన పడవద్దు. ఎన్నికల తర్వాత దళితబంధు అందరికీ వస్తుంది. బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు లేఖ రాయడం వల్లే పథకం ఆగింది. ఏదైనా వారం రోజులే. ఆ తర్వాత పథకం ప్రయోజనాలు అందరికీ వర్తిస్తాయి. గత పాలకులు దళితులను ఏనాడూ పట్టించుకోలే. పూర్తిగా విస్మరించిన్రు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయి. దానికి వాళ్లు సమాధానం చెప్పరు. పైగా దళితబంధుపై దుష్ప్రచారం చేస్తున్నరు. వారి మాటలు నమ్మొద్దు. మనదగ్గరికి వచ్చి దళితబంధు రాదని అంటూనే వేరే వాళ్ల దగ్గరికి పోయి దళితబంధు దళితులకేనా అని రెచ్చగొడుతున్నరు. రానున్న రోజుల్లో అన్నికులాలకు అందిస్తరు. ఉప ఎన్నికలో దళితులంతా ఐక్యంగా ఉండి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలి.
ఈటలతో ఏం కాదు: మాజీ మంత్రి మోత్కుపల్లి
ఈటల ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేసినప్పుడే నియోజకవర్గానికి ఏమీ చేయలే. ఇప్పుడు ఏం చేస్తాడు. నియోజకవర్గంలోని పేదల కోసం సీఎం కేసీఆర్ నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే ఒక్కటీ కట్టలేదు. నేను దళితబంధు పథకానికి ఆకర్షితుడినయ్యే టీఆర్ఎస్లో చేరిన. ప్రతి దళితుడికి దళిత బంధు వచ్చేలా చూస్తా. ఎవరు ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేయాలి. గెల్లును గెలిపించాలె. దళిత బంధును ఆపిన బీజేపోళ్లకు గుణపాఠం చెప్పాలి.