పరపతి సంఘాల అభివృద్ధికి ఇతర ఆదాయ వనరులపై దృష్టి
వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు
నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు
విద్యానగర్, జూన్ 27: కర్షక మిత్ర కింద ప్రతి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి 50 లక్షలు ఇవ్వనున్నట్లు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు స్పష్టం చేశారు. కేడీసీసీబీ బ్యాంకు సమావేశ మందిరంలో సోమవారం జరిగిన బ్యాంక్ 101వ సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. చెల్లింపుల ఆధా రం సంఘాలకు కోటి రుణం అందించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. వరి ధాన్యం సేకరణ ద్వారానే కాకుండా పరపతి సంఘాల అభివృద్ధికి ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించాలని సూచించారు. వ్యక్తిగత రుణాలను పెంచామని. హౌస్ లోన్ను 75 లక్షల వరకు పెంచామని పేర్కొన్నారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా కేబీసీసీబీనికి తీర్చిదిద్దుతున్నామని, అందరి సహకారంతోనే వరుసగా జాతీయ స్థాయిలో ఐదు సార్లు అవార్డు వచ్చిందని తెలిపారు. ఎక్కడ నాబార్డు సమావేశం జరిగినా మన బ్యాంకును ఉదాహరణగా తీసుకోవడం కేడీసీసీబీకి గర్వకారణమన్నారు.
కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు డెయిరీని ప్రోత్సహించాన్నాలని కోరారు. వ్యవసాయం తరువాత పాడి పరిశ్రమను ఆదరించాల్సిన అవసరం ఉందని, చిత్తూరులో పాడి రంగం అభివృద్ధిని ఉదహరించారు. సహకార బ్యాంకు నుంచి 70 కోట్ల రుణం తీసుకున్నామని, దీంతో తిమ్మాపూర్ మం డలం నల్లగొండలో -మూడు లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంగల డెయిరీని నిర్మిస్తున్నామని తెలిపారు. 4వేల లీటర్ల నుంచి నేడు లక్షన్నర లీటర్ల పాల సేకరణతో కరీంనగర్ డెయిరీ ముందుకు సాగుతుందని వివరించారు. పాడి గేదెల కొనుగోలుకు రుణాలు ఇస్తే తాము గ్యారెంటీ ఇస్తామని, డెయిరీ పార్లర్ల ఏర్పాటుకు సంఘాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ రమేశ్, బ్యాంకు సీఈవో ఎస్ సత్యనారాయణ రావు, నాబార్డు అధికారి అనంత్, జిల్లా సహకార అధికారి వనమాల పాల్గొన్నారు. కాగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఇకడికి బదిలీపై వచ్చిన అధికారులను బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు పరిచయం చేశారు.