కార్పొరేషన్, జనవరి 23: కరీంనగర్ వాసులకు నాణ్యమైన పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు అందించే బల్దియా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం ఒకేచోట అందుబాటులో ఉంచే లక్ష్యంతో నగరం నలుమూలల వీటిని నిర్మించనున్నది. ఇప్పటికే మార్కెట్ యార్డులో పనులు ప్రారంభంకాగా, త్వరలోనే మరో నాలుగింటికి భూమిపూజ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఒక్కో దానికి రూ. 10 కోట్ల వెచ్చించనుండగా నగర జనం హర్షం వ్యక్తం చేస్తున్నది.
కరీంనగర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా సరిపడా మార్కెట్లు లేవు. దీంతో ప్రధానరోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. మాంసాన్ని సైతం అపరిశుభ్రకరమై వాతావరణంలో అమ్ముతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. రోడ్లపైనే విక్రయాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావుతో చర్చించి సమీకృత మార్కెట్ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఇప్పటికే మార్కెట్యార్డులో పనులను ప్రారంభించగా చకచకా కొనసాగిస్తున్నారు.
ప్రస్తుత మార్కెట్లతో ట్రాఫిక్ ఇబ్బందులు
ప్రస్తుతం ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్, కశ్మీర్గడ్డ రైతుబజార్, రాంనగర్, ఎస్ఆర్ఆర్ కళాశాల, ఇందిరానగర్ మార్కెట్లలో అమ్మకాలు సాగుతున్నాయి. వీటితో పాటు ప్రధాన మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, రాంనగర్, కశ్మీర్గడ్డలోని ఫిష్ మార్కెట్లు సాగుతున్నాయి. అయితే, ఈ ప్రాంతాల్లో సరైన పార్కింగ్ సౌకర్యం లేక కొందరు రోడ్లపైకి వచ్చి అమ్మకాలు సాగిస్తుండడంతో పదే పదే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వీటన్నింటికీ పరిష్కారం చూపించే దిశగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. దీనిలో భాగంగా నగరంలో నాలుగు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
ఒకే ప్రాంతంలో అన్ని రకాల మార్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఈ సమీకృత మార్కెట్లను సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో వెజ్, నాన్వెజ్ మార్కెట్లతో పాటు పండ్లు, ఇతర మార్కెట్లను కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఈ మార్కెట్లకు వచ్చే వ్యాపారులు, కొనుగోలుదారులకు సరైన పార్కింగ్ సౌకర్యాలతో పాటు మూత్రశాలలు, ఇతర సదుపాయాలు కల్పించే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా నాన్ వెజ్ మార్కెట్లో అపరిశుభ్ర వాతావరణం లేకుండా పూర్తిస్థాయిలో నీటి సదుపాయం కల్పించడంతో పాగా నాణ్యమైన మాంసం అందించేందుకు చర్యలు చేపట్టే దిశగా రంగం సిద్ధం చేశారు. అలాగే, ఈ మార్కెట్లో చెత్తను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నగరంలో వివిధ రోడ్లపై అమ్ముకుంటున్న వారందరినీ ఇక్కడికి తరలించేందుకు కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.
రూ. కోట్లతో నిర్మాణం..
నగరానికి నలువైపులా వీటిని నిర్మించనున్నారు. నగరంలోని 5 ప్రాంతాల్లో ఈ మార్కెట్లను నిర్మాణం చేపట్టనున్నారు. వీటి కోసం సుమారు రూ. 50 కోట్ల మేరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఇప్పటికే రూ. 5.80 కోట్ల వ్యయంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సమీకృత మార్కెట్ పనులను ప్రారంభించి వేగంగా చేపడుతున్నారు. వీటితో పాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు ఉన్న ఇరిగేషన్ కార్యాలయ స్థలంలో రూ. 14.50 కోట్ల వ్యయంతో అత్యంత ఆధునిక సమీకృత మార్కెట్ను సిద్ధం చేయనున్నారు. ఈ మార్కెట్లో సుమారు 300 నుంచి 350 మంది అమ్మకాలు జరుపుకొనేలా తీర్చిదిద్దుతున్నారు. వీటితో పాటు కశ్మీర్గడ్డ రైతుబజార్లో రెండతస్తులతో సమీకృత మార్కెట్ను నిర్మించేందుకు డిజైన్లు సిద్ధమవుతున్నాయి. అలాగే, పద్మనగర్లో సుమారు రెండెకరాల ప్రభుత్వ స్థలంలో మరో సమీకృత మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు ఆర్టీసీ వర్క్షాపు వద్ద కూడా అదే స్థాయిలో మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ స్థలాలను ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. వీటితో పాటు రాంపూర్ వైపు కూడా మరో మార్కెట్ను నిర్మించేందుకు ప్రభుత్వ స్థల సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
సదుపాయాల కల్పనే లక్ష్యం
నగర ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నం. సమీకృత మార్కెట్ల ఏర్పాటుతో ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు. . . ప్రజలకు అన్ని రకాల మార్కెట్లు ఒకే దగ్గర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయనున్న మార్కెట్ పనులు ప్రారంభించాం. మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా వేగంగా నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న మినీ, ఇతర కూరగాయాల మార్కెట్లల్లో మరిన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు కూడా తగు చర్యలు తీసుకుంటాం.