నూకపెల్లి శివారు ప్రాంతం.. గుట్టను ఆనుకున్న ఆ భూములు 2017కు ముందు పడావు పడి ఎందుకూ పనికిరానివిగా ఉండేవి. కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కారు సంకల్పంతో అక్కడ ఒక పట్టణమే రూపుదిద్దుకున్నది. 300 కోట్లతో సకల సౌకర్యాలు, వసతులతో హైదరాబాద్ తదుపరి రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే చోట 4,520 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. అందులో ఎంపిక చేసిన 3,722 మంది లబ్ధిదారులకు అందజేసే మహత్తర క్షణం వచ్చేసింది. జగిత్యాల కీర్తి కిరీటంలోనే కలికితురాయిగా నిలవబోతున్న నూకపెల్లి కేసీఆర్ డబుల్ బెడ్రూం కాలనీని మంగళవారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ) : దాదాపు ఆరేండ్ల క్రితం అప్పటి నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అత్యంత శ్రద్ధ వహించి, జగిత్యాల పట్టణ ప్రాంతంలోని నిరుపేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబీకులకు సొంత ఇండ్లను నిర్మించి ఇవ్వాలని చేసిన శ్రమ నేడు ఫలప్రదం కాబోతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అత్యంత భారీ సంఖ్యలో 4,520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని జగిత్యాలలో చేపట్టడం, స్థలం ఎంపిక చేయడం నుంచి మొదలుకొని అనేక వ్యయ ప్రయాసల మధ్య, కాలానికి, కరోనా కష్టాలకు ఎదురీది రెండు పడకల ఇండ్ల నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. అత్యంత అందంగా, నాణ్యంగా దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న నూకపెల్లి కేసీఆర్ డబుల్ బెడ్రూం కాలనీ త్వరలోనే ఒక పట్టణంగా రూపాంతరం చెందబోతున్నది.
నెరవేరనున్న సొంతింటి కల
ప్రతి మనిషి కలల సౌధం సొంతింటి నిర్మాణం.. దీనికోసం ప్రతి వ్యక్తీ తపిస్తాడు.. సొంతిల్లు అనేది నిరుపేదలకు, మధ్యతరగతి వారికి అతిపెద్ద సాఫల్యత చిహ్నం.. సొంతింటిలో బతకడమనేది మనిషికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే నైతిక బలం లాంటిది.. అయితే, తరతరాలుగా నిరుపేదలకు ఇంటి నిర్మాణం చేసుకోవడం ఒక కలగానే మిగిలిపోతూ వస్తోంది.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం నేపథ్యంలో గుడిసెలాంటి ఒకగది ఇండ్ల నిర్మాణానికి ముప్పై, నలభై వేల రూపాయలు సహాయం చేసి, చేతులు దులుపుకున్న పరిస్థితి.. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. స్వరాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు, మౌలిక వసతులైన విద్యుత్, అంతర్గత రోడ్లు, తాగునీరు, తదితర సౌకర్యాల కల్పన కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
హైదరాబాద్ తదుపరి రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాజెక్టు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఉద్యమనేతగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో డబుల్బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎంగా కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. కాగా, జగిత్యాల పట్టణంలో పెద్ద సంఖ్యలో నిరుపేదలు, దిగువ మధ్య శ్రేణి వర్గాల ప్రజలున్నారని, గుర్తించి వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయాలని సంకల్పించారు 2017లో అప్పటి నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అప్పటి జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్తో కలిసి సీఎం కేసీఆర్ను కలిసి జగిత్యాలకు పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు.
పరిస్థితిని పూర్తిస్థాయిలో పరిశీలించిన సీఎం కేసీఆర్ జగిత్యాల సమీపంలో ఉన్న నూకపెల్లిలో, రాష్ట్ర ప్రత్యేక కోటా నుండి 4520 డబుల్బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2017 ఏప్రిల్ 17న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, వాటి నిర్మాణం శరవేగంగా సాగుతూ వచ్చింది. అయితే, మధ్యలో రెండు సంవత్సరాల పాటు కరోనా విజృంభించడంతో కాలనీ నిర్మాణ పనులు అన్నీ నిలిచిపోయాయి. దాదాపు మూడేండ్ల తర్వాత మళ్లీ ఇండ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తదుపరి ఒకే చోట జీప్లస్ వన్, జీప్లస్ టూ పద్ధతిలో రూ.280 కోట్లతో 4,520 డబుల్బెడ్ రూం ఇండ్లు ఆశ్చర్యం కలిగే రీతిలో నిర్మించారు. ఇప్పటి వరకు 3,722 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
మౌలిక వసతుల కల్పన కోసం రూ.40కోట్లు
4,520 డబుల్ బెడ్రూం కాలనీవాసుల కోసం పలు సౌకర్యాల కల్పనను చేపట్టారు. రూ.40 కోట్లు వెచ్చించి కాలనీవాసుల కోసం మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. కాలనీలో మంచినీటి సౌకర్యం కోసం ఎస్సారెస్పీ కాకతీయ కాలువ నుంచి ప్రత్యేకంగా పైప్లైన్ను వేయించారు. కాలనీలో మూడు పెద్దపెద్ద ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులను నిర్మించారు. వీటిని మిషన్ భగీరథతో అనుసంధానం చేసి, శుద్ధజలాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. ఇక కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. వీటితోపాటు, కాలనీలో రూ.14 కోట్ల వ్యయంతో విద్యుత్ సౌకర్య కల్పన పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కాలనీలో ప్రజల సౌకర్యార్థం ఆలయం, మసీదు, చర్చి నిర్మాణం సైతం పూర్తి చేస్తున్నారు. వీటితో పాటు, కాలనీలో ఇతరత్రా సౌకర్యాల కల్పనపై సైతం దృష్టి సారించారు.
3,722 మంది లబ్ధిదారులకు పంపిణీ
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం 3,722 మంది లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లు అందించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికలో దళిత, గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లు సైతం అధికారులు పరిగణలోకి తీసుకున్నారు.
నయా పోలీస్ సౌధం రెడీ నేడు ప్రారంభోత్సవం
ఆధునిక హంగులు.. అత్యాధునిక సౌకర్యాలతో జగిత్యాల జిల్లా కేంద్రంలో నయా పోలీస్ సౌధం సిద్ధమైంది. సమీకృత కలెక్టరేట్ సమీపంలోనే ధరూర్ కాలనీలో 20 ఎకరాల స్థలంలో భవనం రూపుదిద్దుకున్నది. 47వేల చదరపు ఫీట్ల స్థలంలో 38.4కోట్లతో జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మాణమైంది. జిల్లా పోలీస్ ప్రధాన ఆఫీస్తో పాటు ఎస్పీ కార్యాలయం, ఎస్పీ క్యాంపు ఆఫీస్, ఎస్పీ రెసిడెన్సీ, అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ రెసిడెన్సీ, గ్రీవెన్స్ హాల్, పాస్పోర్టు వెరిఫికేషన్ సెల్, పీఆర్వో ఆఫీసు, పోలీస్ ప్రధాన కార్యాలయ స్టోర్, డీసీఆర్బీ, ఐటీఅండ్కమ్యూనికేషన్, ఫింగర్ప్రింట్ క్లూస్ టీం, ఎస్బీ విభాగాలకు కార్యాలయాలు, ఏర్ హెడ్ క్వార్టర్స్, డిజిటల్ ట్రైనింగ్, శిక్షణ కేంద్రం, ఆడిటోరియం, అధికారుల నివాస గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్కు సంబంధించిన పనులు పూర్తికాగా, మిగిలిన ఫ్లోర్లల్లో పనులు చివరి దశలో ఉన్నాయి. కాంపౌండ్, మైదానం, గ్రీనరీ, పార్కింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. మంగళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అధునాతన సమీకృత మార్కెట్
ఏ నగరంలో అయినా, పట్టణంలో అయినా మార్కెట్లు జనాభాకు సరిపడా లేవు. చాలాచోట్ల ఒకటో రెండో ఉన్నా.. అందులో చాలావరకు వసతులు సరిగ్గా లేవు. కొన్ని చోట్ల రోడ్లపై ఉంటే.. మరికొన్ని చోట్ల జనావాసాలకు దూరంగా ఉన్నాయి. కూరగాయలు దొరికిన చోట మాంసం దొరకదు.. మాంసం దొరికిన చోట కూరగాయలు దొరకవు. ఫలితంగా ప్రజలతోపాటు వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇదే పరిస్థితి జగిత్యాలలో కూడా ఉన్నది. జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలోనే ఏడు దశాబ్దాలుగా కూరగాయల మార్కెట్, మాంసం మార్కెట్ నిర్వహిస్తున్నా, ఎలాంటి అభివృద్ధి లేదు. పట్టణ విస్తీర్ణం పెరిగినప్పటికీ అందుకనుగుణంగా విస్తరణ జరగలేదు. కానీ, స్వరాష్ట్రంలో రాష్ట్ర సర్కారు సమీకృత మార్కెట్లపై దృష్టి సారించింది. నగరాలు, పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నది.
జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపి పాతికేండ్ల క్రితం నిర్మించిన రైతుబజార్ వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నా.. కూరగాయల మార్కెట్ విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. దాంతో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పూర్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో సమీకృత మార్కెట్ ఆవరణలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. 4.50 కోట్ల పట్టణ ప్రగతి ప్రత్యేక నిధులతో రెండెకరాల స్థలంలో రెండు భారీ షెడ్లు, కౌంటర్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. మున్సిపాలిటీలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈ నిర్మాణాలను పూర్తి చేయగా, ఈ మార్కెట్ను మూడు బ్లాక్లుగా విభజించారు. 52 స్టాళ్లను కూరగాయల విక్రేతలకు, 30 స్టాల్స్ను మాంసం, చేపల విక్రేతలకు కేటాయించారు. 18 స్టాల్స్ను పూలు, పండ్ల వ్యాపారులకు కేటాయించారు. అధునాతన సౌకర్యాలతో పూర్తయిన ఈ సమీకృత మార్కెట్ను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
అమ్మకు ఆలంబన
అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర సర్కారు, మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ధర్మపురి పట్టణంలో ఇప్పటికే 100 పడకల దవాఖానను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇటీవలే ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ యూనిట్ను ఏర్పాటు చేసింది. కాగా, ధర్మపురికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గ కేంద్రంలో 8.50 కోట్ల వ్యయంతో 50 పడకల సామర్థ్యం కలిగిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయించారు. 1.26 ఎకరాల స్థలంలో జీ ప్లస్ వన్ పద్ధతిలో భవన నిర్మాణం పూర్తి కావచ్చింది. 6.77కోట్లు భవన నిర్మాణానికి కేటాయించగా, మిగిలిన నిధులను మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు. ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ బెడ్స్, పుట్టిన పిల్లల సంరక్షణ కోసం ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. నవజాత శిశు సంరక్షణ గదులు, ఓపీ బ్లాక్, లేబర్ రూం, ఈసీజీ, ఎక్స్రే కోసం గదులు, పోస్టు ఆపరేషన్ 10 బెడ్స్, నార్మల్ రిస్క్, హై రిస్క్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. పనులు పూర్తికా రాగా, నేడు మంత్రి కేటీఆర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కాగా, దవాఖాన అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్యం అందనుండగా, గర్భిణులు, బాలింతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.