గిరిజన బాలికల విద్యార్థులకు నాణ్యమైన విద్యకోసం రాష్ట్ర సర్కారు భరోసా కల్పిస్తున్నది. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది. దళిత, గిరిజనుల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించడానికి సకల సౌకర్యాలను కల్పిస్తూ ఆధునిక వసతులతో విద్యను అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో రుద్రంగి మండలంలోని గైదిగుట్టతండాలో 4.20 కోట్లతో సకల వసతులతో అధునాతన భవనం నిర్మిస్తున్నది.
-రుద్రంగి, జూన్ 24
గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నది. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 4 కోట్ల 20 లక్షల నిధులతో బాలికల గురుకుల పాఠశాలకు భవనం మంజూరుకు కృషి చేశారు. మానాల, గిరిజన గ్రామాల గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రుద్రంగి మండలం గైదిగుట్టతండా గ్రామంలో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం జీప్లస్ టూ విధానంలో సకల సౌకర్యాలను కల్పిస్తూ ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మిస్తున్నారు. అందులో మూడు బ్లాకుల్లో 8 గదులు ఉన్నాయి. మొత్తం భవనంలో 24 గదులు ఉన్నాయి. తరగతి గదులతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 480 మంది విద్యార్థులు విద్యనభ్యసించనున్నారు. ఆ భవనం పక్కనే కిచెన్, డైనింగ్ కోసం మరో భవనాన్ని నిర్మిస్తున్నారు. స్కూల్ బిల్డింగ్, అదనపు మరుగుదొడ్లు, నీటి ట్యాంక్, కాంపౌండ్ వాల్, అప్రోచ్ రోడ్కు రూ.5 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పాఠశాల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తికావస్తున్నాయి. దీంతో తమ పిల్లల కష్టాలు తీరనున్నాయని గిరిజన విద్యార్థినుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు నాణ్యమైన విద్య
పేద విద్యార్థులకు అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. గిరిజన సంక్షేమ పాఠశాలలు గిరిజన విద్యార్థులకు వరంగా మారాయి. గైది గుట్టతండా గ్రామంలో బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడంతో మానాల, గిరిజనతండా గ్రామాల విద్యార్థులకు మంచి అవకాశం ఏర్పడింది. ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాల మంజూరుకు కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు.
-వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య (రుద్రంగి)
విద్యార్థినులకు ప్రయోజనం
రుద్రంగి మండలంలో గిరిజన గ్రామాలతోపాటు ఇతర దూర ప్రాంతాల నుంచి వస్తున్న బాలికలకు హాస్టల్ వసతితోపాటు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందనుండటంతో వారికి చాలా ప్రయోజనం చేకూరనున్నది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 4 కోట్ల 20 లక్షల నిధులతో బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి చొరవ చూపడం అభినందనీయం. భవన నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. త్వరతగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.
– దేగావత్ తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు (రుద్రంగి)