పెద్దపల్లి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయం పండుగలా మారింది. పుష్కలమైన నీళ్లు, 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో సంబురంగా సాగింది. కానీ, కాంగ్రెస్ సర్కారు వంద రోజుల పాలనలో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా సాగునీటి గోస తీవ్రమవుతున్నది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేలకు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. చేతికి వచ్చే దశలో దెబ్బతిన్నాయి. మున్ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉండనున్నాయి. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. స్థానికంగా ఉండే పాలకులు కూడా కనీసం కన్నెత్తి చూడలేదు.
ఇటు యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నటి వరకు రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకోగా.. ఇప్పుడు రైతులు పడుతున్న కష్టాన్ని చూసి బీఆర్ఎస్ నాయకులు చలించిపోతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భరోసానిస్తున్నారు. ఇటీవల మంథని, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి, పెద్దపల్లి మండలాల్లో దెబ్బతిన్న పొలాలను పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. రైతులకు మేమున్నామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఎండిన పంటలను సర్వే చేయాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేల పరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదుకునేంత వరకూ వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు.
శనివారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో 36గంటల రైతు నిరసన దీక్షకు పిలుపునిచ్చి, దీక్షకు అనుమతి కోసం ప్రభుత్వానికి విన్నవించారు. అయితే పోలీసులు దీక్షను బహిరంగ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లలో కాకుండా పార్టీ జిల్లా కార్యాలయంలోనే చేసుకోవాలని అనుమతి ఇవ్వడంతో అక్కడే చేసేందుకు నిర్ణయించారు. నేటి ఉదయం 8 నుంచి ఆదివారం రాత్రి 8గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో పంటలు నష్టపోయిన రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా 14 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తోపాటు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లను మాజీ మంత్రి కొప్పుల, జడ్పీ చైర్మన్ మధూకర్, మాజీ ఎమ్మెల్యే దాసరి పరిశీలించారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్, పార్టీ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. ఇటు దీక్షను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. రామగుండం నియోజకవర్గంలోని రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.