రామడుగు, నవంబర్ 29: మండలంలోని గుండి వేణుగోపాల స్వామి ఆలయ భూములను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేశారు. వేణుగోపాల స్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని, స్వాధీనం చేసుకొని హద్దులు ఏర్పాటు చేయాలని సర్పంచ్ గుండి మానస దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులకు గతేడాది విజ్ఞప్తి చేశారు. దీంతో సంబంధిత అధికారులు సోమవారం గుండికి చేరుకొని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఆలయ భూములకు హద్దులు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, వేణుగోపాలస్వామి ఆలయ పరిధిలో 18.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. కాగా, సర్వే నంబర్ 207లో 1.17 ఎకరాలు, 209లో 1.03, 189/ఏలో 3.19, 189/బీలో 3.15, 210లో 0.05, 465లో 2.29, 537/ఏలో 0.35, 537/బీలో 0.37 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సర్వే నంబర్ 32, 208లో గల రెండెకరాలు కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. ఆలయ భూముల్లో కౌలు వేలం వేసే వరకు పంటలు సాగు చేయరాదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ సుప్రియ, ఇన్స్పెక్టర్ బేల్సింగ్, ఈవోలు మారుతీరావు, కిషన్రావు, కాంతారెడ్డి, విక్రమ్, దేవాదాయ శాఖ కార్యాలయ సిబ్బంది, ఏఎస్ఐ అనంతరెడ్డి, హెడ్కానిస్టేబుల్ రాజయ్య, సర్వేయర్ రాకేశ్, వీఆర్ఏలు సాగర్, కల్యాణ్, రమేశ్, శంకర్, మహమూద్, గ్రామస్తులు గుండి ప్రవీణ్, మాధవ చారి, రంగు రాములు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.