పోషకాహారం ప్రాధాన్యతను మహిళలకు వివరించాలి
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
విద్యానగర్, నవంబర్ 29: కరీంనగర్ను రక్తహీనత రహీత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్ కరీంనగర్పై అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలల్లో చదివే బాలికలు, 14 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య గల వయస్సు గల మహిళలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు విరివిగా పరీక్షలు నిర్వహించి, రక్తహీనత ఉన్న వారికి ఐరన్ మాత్రలు ఇవ్వాలని సూచించారు. రక్తహీనత పోషకాహార లోపం, పేదరికం తదితర కారణాలతో వస్తుందని తెలిపారు. కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీల్లో పనిచేసే మహిళలు, విద్యార్థినులకు విడుతల వారీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు రక్తహీనత పరీక్షలు చేయాలన్నారు. పోషకాహారం ప్రాధాన్యతను మహిళలకు వివరించేలా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని సూచించారు. అనంతరం రక్తహీనత- తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన మూడు రకాల పోస్టర్లను కలెక్టర్ ఆవిషరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా సంక్షేమాధికారి బీ రవీందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, డీసీవో శ్రీమాల, మారెటింగ్ శాఖ ఏడీ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి రావు, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్రెడ్డి, సీడీపీవోలు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు