అనుగుణంగా అధికారులు, కార్మికులు పనిచేయాలి
డైరెక్టర్ పీపీ చంద్రశేఖర్
ఇందారం ఓసీ వద్ద 33 కేవీ సబ్స్టేషన్,ప్రీ వే లోడింగ్ బంకర్, 6.4 క్యూబిక్ మీటర్ లోడర్ ప్రారంభం
జైపూర్, నవంబర్ 29 : యాజమాన్యం బొగ్గు నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని, అందుకు తగినట్లుగా అధికారులు, కార్మికులు పనిచేయాలని డైరెక్టర్ పీపీ చంద్రశేఖర్ సూచించారు. ఇందారం ఓపెన్కాస్టు వద్ద 33 కేవీ సబ్స్టేషన్, రూ.6.20 కోట్లతో నిర్మించిన ప్రీవే లోడింగ్ బంకర్, రూ.3.94 కోట్లతో కొనుగోలు చేసిన 6.4 క్యూబిక్ మీటర్ లోడర్ సోమవారం డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) ఎన్ బలరాం, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డీ సత్యనారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగా పీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలో ఇందారం ఓపెన్ కాస్టును ప్రారంభించి రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్న అధికారులను అభినందించారు. ఇప్పటి వరకు 1.2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తుండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టినట్లు చెప్పారు. కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అతి తక్కువ సమయంలో ప్రీవే బంకర్ నిర్మించిన టెక్నీషియన్లకు డైరెక్టర్ల చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. అనంతరం శ్రీరాంపూర్ జీఎం సురేశ్, పీవో రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఇందారం ఓపెన్కాస్టు గనికి ప్రత్యేకంగా సబ్స్టేషన్ లేనందున 33 కేవీ/ 3.3 కేవీ సబ్స్టేషన్ నిర్మించినట్లు చెప్పారు. గతంలో ఐకే 1ఏ గని నుంచి విద్యుత్ను తీసుకొని ఓపెన్కాస్టులో వాడేవారన్నారు. సబ్స్టేషన్ ఏర్పాటుతో పవర్ హెచ్చు తగ్గుల సమస్య ఉండదని వివరించారు. అలాగే రూ.6.20 కోట్లతో నిర్మించిన ప్రీవే లోడింగ్ బంకర్ సింగరేణిలో ప్రథమమని పేర్కొన్నారు. ఈ బంకర్ గంటకు 1000 టన్నుల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. దీంతో కంప్యూటర్లో నిక్షిప్తం చేసిన విధంగా ఎన్ని టన్నుల బొగ్గు అనేది ఆటోమేటిక్గా లారీల్లో గానీ, ట్రక్కుల్లో గానీ లోడ్ చేయవచ్చని చెప్పారు. రూ.3.94 కోట్లతో కొనుగోలు చేసిన 6.4 క్యూబిక్ మీటర్ లోడర్ను ప్రారంభించారు. ఈ లోడర్ సాయంతో డం పర్లకు బొగ్గు లోడ్ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి, ఎస్వోటూ డైరెక్టర్ జానకీరాం, సీఎంవోఐ అధ్యక్షుడు జక్కం రమేశ్, ఎస్సార్పీ గని గ్రూప్ ఏజెంట్ విజయభాస్కర్, మేనేజర్ ఉమాకాంత్, రక్షణ అధికారి పేరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.