చరిత్ర పుటల్లో సీఎం
నాడు ఆయన వెంట నిలిచినందుకు ఎంతో గర్వంగా ఉంది
దీక్షా దివస్ సందర్భంగా మంత్రి ఈశ్వర్
ధర్మపురి, నవంబర్ 29: ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత వాతావరణంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సోమవారం దీక్షా దివస్ సందర్భంగా మంత్రి ఈశ్వర్ ‘నమస్తే’తో మాట్లాడుతూ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ వ్యూహాత్మకమైన రాజకీయ చతురతతో నడిపించారని పేర్కొన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని స్పష్టం చేశారు. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో కేసీఆర్ చేపట్టిన అంకుఠిత ఆమరణ దీక్ష ఉద్యమంలో కీలకంగా మారిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడిందన్నారు. 2001లో పిడికెడు మందితో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ సీమాంధ్ర ప్రభుత్వాల కుట్రలను ధైర్యంతో ఎదుర్కొన్నారని కొనియాడారు. ఆ సమయంలో ఆయన వెంట నిలిచినందుకు ఎంతో గర్వంగా ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరుల కుటుంబాలకు కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచారని, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకున్నారని పేర్కొన్నారు. ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. అంతే కాకుండా మలిదశ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు.