సత్ఫలితాలనిస్తున్న విలేజ్ పార్కులు
ఏపుగా పెరిగిన మొక్కలు
అందుబాటులోకి వచ్చిన పండ్లు
గంగాధర, నవంబర్ 28: పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ గ్రామాలను పచ్చతోరణంలా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఫలిస్తున్నది. గతేడాది హరితహారంలో భాగంగా మండలంలో వివిధ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వాటిలో నాటిన మొక్కలు ఎండి పోకుండా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగి ఫలాలనిస్తున్నాయి.
పకడ్బందీగా సంరక్షణ చర్యలు
పల్లెలు, పట్నాలు తేడా లేకుండా రోజురోజుకూ పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతేడాది మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. జామ, దానిమ్మ, అల్లనేరేడు, మామిడి, సపోట, ఉసరి, సీతాఫలం తదితర పండ్ల మొక్కలను నాటారు. అలాగే వివిధ రకాల పూల మొక్కలను నాటి పకడ్బందీగా సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఎండకాలంలో మొక్కలు ఎండి పోకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సిబ్బంది నీళ్లు పడుతున్నారు. పశువులు మేయకుండా ప్రకృతివనాల చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రకృతివనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి కాయలు కాస్తుండడం విశేషం.
కాయలు కాస్తున్నయ్
గంగాధరలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం. వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను నాటాం. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందితో రోజూ మొక్కలకు నీళ్లు పోయిస్తూ ఎండిపోకుండా చూస్తున్నాం. ప్రస్తుతం మొక్కలు కాయలు కాస్తున్నయ్.