33 జిల్లాల నుంచి 736 మంది క్రీడాకారుల రాక
2 నుంచి 10 కిలోమీటర్ల విభాగాల్లో పరుగు
పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారుల సత్తా
ఓవరాల్ చాంపియన్ షిప్ కైవసం
విజేతలకు ట్రోఫీల ప్రదానం
తెలంగాణ కీర్తిని నలుదిశలా చాటాలి: మంత్రి గంగుల
కొత్తపల్లి, డిసెంబర్ 27: కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ కైవసం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగరంలోని క్రీడా పాఠశాల సమీపంలో రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించారు. పోటీలకు 33 జిల్లాల నుంచి 736 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ముందుగా జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉదయం 8 గంటలకు క్రాస్ కంట్రీ పోటీలను పోలీసు అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను కల్పించారు.
తెలంగాణ కీర్తిని నలుదిశలా చాటాలి: మంత్రి గంగుల కమలాకర్
రాష్ర్టానికి చెందిన క్రాస్ కంట్రీ క్రీడాకారులు త్వరలో నాగాలాండ్ జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటాలని, తెలంగాణ కీర్తిని జాతీయస్థాయిలో ఇనుమడింప చేయాలని మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. కరీంనగర్లో సోమవారం నిర్వహించిన క్రాస్ కంట్రీ పోటీల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి, ట్రోఫీలను అందించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. 33 జిల్లాల స్థాయి క్రాస్ కంట్రీ పోటీలను తొలిసారిగా కరీంనగర్లో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, ఫాల్కన్ క్లబ్ ప్రతినిధులను ఆయన అభినందించారు. మొబైల్ ఫోన్ల రాకతో విద్యార్థులకు శారీరక శ్రమ కరువైందని, పిల్లల ఫిజికల్ ఫిట్నెస్పై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, వారికి ఇష్టమైన క్రీడలో శిక్షణ ఇప్పించాలని కోరారు. కరీంనగర్లో జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తే తనవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. జాతీయ పోటీలకు ఎంపికైన రాష్ట్ర జట్టు క్రీడాకారులకు తానే స్వయంగా ట్రాక్షూట్లను అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులను నాగాలాండ్లో జనవరి 17న జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఇక్కడి క్రీడా పాఠశాలలో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ను త్వరలో పూర్తిచేసే బాధ్యతను మంత్రి తీసుకోవాలని కోరారు. సింథటిక్ ట్రాక్ పూర్తయితే జిల్లా కేంద్రంలో అనేక జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహించే అవకాశం లభిస్తుందన్నారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా పోటీలను నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మేయర్ వై సునీల్రావు, డీవైఎస్ఓ కే రాజవీరు, కార్పొరేటర్ జంగిలి ఐలేందర్యాదవ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, బేస్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కడారి రవి, ఏసీపీ తుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్గా సిద్దిపేట
8వ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో అత్యధిక పాయింట్లు సాధించిన సిద్దిపేట జిల్లా క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్షిప్ను అందుకున్నారు. పురుషుల విభాగంలో 10 కిలోమీటర్ల పోటీలో నాగర్కర్నూల్ జిల్లా టీం, మహిళల విభాగంలో సిద్దిపేట జిల్లా చాంపియన్ షిప్లను అందుకున్నారు. అలాగే అండర్-20 బాలుర విభాగంలో 8 కిలోమీటర్ల పోటీలో సిద్దిపేట జిల్లా, బాలికల విభాగంలో 6 కిలోమీటర్ల పోటీలో జగిత్యాల జిల్లా టీం చాంపియన్షిప్లను కైవసం చేసుకున్నాయి.