వచ్చే నెలలోనే పనులు ప్రారంభిస్తాం
మూడు నెలల్లోగా కేబుల్బ్రిడ్జిపై నుంచి రాకపోకలు
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మణిహారంగా నిలిచే మానేరు రివర్ఫ్రంట్ పనులు జనవరిలో ప్రారంభమవుతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం నగరంలోని మీసేవ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనేక అంశాలపై మాట్లాడారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ రోడ్లు, కేంద్ర నిధులపై వస్తున్న ఆరోపణల్లో నిజాలతో పాటు కేబుల్ బ్రిడ్జికి వచ్చిన అదనపు నిధులు, కరీంనగర్ -సిరిసిల్ల నాలుగువరుసల రోడ్లు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మాట్లాడారు. మానేరు రివర్ ఫ్రంట్పూర్తిస్థాయి పనులు వచ్చే జనవరి చివరి వారంలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు పూర్తయిందని చెప్పారు. ప్రాజెక్టు కొంత ఆలస్యం అవుతున్నా పర్యాటకరంగంలో ఆకర్షణీయంగా ఉమ్మడి జిల్లాకు మణిహారంగా నిలిచేలా డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే మానేరు రివర్ ఫ్రంట్కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇస్తామని చెప్పారు. జనవరి మొదటి వారంలో ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. అయితే కేబుల్ బ్రిడ్జి పనుల పూర్తికి ప్రభుత్వం తాజాగా మరో 41కోట్లు మంజూరు చేసిందన్నారు. గతంలో 183 కోట్లు ఇస్తే కేబుల్ బ్రిడ్జితోపాటు పలు పనులు పూర్తిచేశామని, ఇంకా అప్రోచ్రోడ్డు పనులు చేయాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం కావాల్సిన భూసేకరణ, అలాగే రోడ్డు పనుల కోసం అంటే కమాన్ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు.. అలాగే కేబుల్ బ్రిడ్జి నుంచి సదాశివ పల్లి దాకా రోడ్డు నిర్మాణం కోసం 35కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీంతో పాటు కేబుల్ బ్రిడ్జిపై దేశంలో ఎక్కడా లేని విధంగా డైనమిక్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు 6 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ పనులను వచ్చే మూడు నెలల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కరీంనగర్-సిరిసిల్ల నాలుగువరుసల రోడ్ల పనులు సాగుతున్నాయన్నారు. వీటి విషయంలో కొంత అలస్యమవుతున్నదంటూ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పిన మంత్రి, ఆలస్యమవుతున్నా ఇది ఒక మోడల్ రోడ్డులా నిర్మిస్తున్నామని వివరించారు. దీంతోపాటు కరీంనగర్ టూ ఎలగందుల వరకు పాత రోడ్డుతో పాటు లోయర్మానేరు డ్యాం, కాకతీయ కెనాల్పై బ్రిడ్జిల నిర్మాణానికి అవసరమైన రూ.35 కోట్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిందన్నారు. ఈ రోడ్డు పూర్తయితే ఎంతో చరిత్ర ఉన్న ఎలగందుల ఖిల్లాకు వెళ్లి రావడం చాలా సులువవుతుందని వివరించారు.
కావాలని విమర్శలు చేస్తే ఊరుకోం..
స్మార్ట్ సిటీ కోసం సీఎం అస్యూరెన్స్ పథకం కింద ఇప్పటికే 350 కోట్లు శాంక్షన్ కాగా, తాజాగా మరో రూ.100 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. స్మార్ట్ సిటీ కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కార్పొరేషన్ ఖాతాలో జమచేసిందన్నారు. అయితే పనులకు కేవలం కేంద్రం నిధులు మాత్రమే వాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. స్మార్ట్ సిటీ లెక్కలు తీస్తే అన్ని బయట పడుతాయన్నారు. మొన్నటి వరకు వరుసగా ఎన్నికలు రావడం తద్వారా ఎన్నికలకోడ్ అమల్లో ఉండడంతో అభివృద్ధి పనులు కొంత జాప్యమైన మాట వాస్తవమని అంగీకరించిన మంత్రి.. మళ్లీ ఇక నుంచి తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా వచ్చే వాళ్లందరనీ కలుపుకొని పోతామని చెబుతూనే.. తమపై కావాలని విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోబోమని, రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే స్వరాష్ట్రం వచ్చిన తర్వాత గత యాభై ఏండ్లలో జరుగని అభివృద్ధి కరీంనగర్ టౌన్లో జరుగుతుందన్న మంత్రి, తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.700 కోట్లతో నగరంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. సమావేశంలో మేయర్ సునీల్రావు, ఎంపీపీ లక్ష్మయ్య, టీఆర్ఎస్ నాయకులు హరిశంకర్, ఎండ్ల వాసాల రమేశ్, సంపత్రావు కరీంనగర్, దుర్శేడ్ ప్యాక్స్ చైర్మన్లు శ్యాంసుందర్రెడ్డి, బల్మూరి ఆనందరావు పాల్గొన్నారు.