జీఎస్టీ రద్దుకు ఐక్య వేదిక డిమాండ్
వస్త్ర వ్యాపారాల బంద్కు నిర్ణయం
నేటి నుంచి సిరిసిల్లలో దీక్షలు
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : నేతన్నలకు కేంద్ర సర్కారు నూతన సంవత్సరం చేదు వార్తను అందిస్తున్నది. వస్త్ర ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని 12 శాతం పెంచుతూ ఇప్పటికే జీవో జారీ చేయగా, పెంచిన పన్నులు వచ్చే జనవరి ఒకటి నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో వస్త్ర ఉత్పత్తిదారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ముడి సరుకులైన నూలుపై 5 శాతం , రంగులు, రసాయనాలపై 18 శాతం, బట్ట తయారీపై 5 శాతం పన్నులు వసూలు చేస్తున్నది. ఇది సరిపోదంటూ బట్ట తయారీపై ఉన్న 5 శాతం పన్నును మరో 7 శాతం అంటే 12 శాతానికి పెంచింది. దేశ చరిత్రలో వస్త్ర పరిశ్రమపై ఇంత పెద్ద ఎత్తున పన్ను లు వేయడం ఇదే మొదటిసారి. అది కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పన్నుల మీద పన్ను లు వేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర సర్కారు రక్ష.. కేంద్రం కక్ష
లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర సర్కారు అనేక రాయితీలు ఇస్తూ అండగా నిలిచింది. నూలు, విద్యుత్పై యాభై శాతం సబ్సిడీ ఇస్తూనే కార్మికుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ కేంద్రాలు, ప్రతి సాంచాకు జియోట్యాగింగ్, 50 ఏండ్లకే వృద్ధాప్య పింఛన్, చేతినిండా పని, నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కూలి వచ్చేలా ఏటా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఉచితంగా పంపిణీ చేసే వస్త్ర ఉత్పత్తులకు ఆర్డర్లు ఇవ్వడం వంటివి చేస్తున్నది. అంతే కాకుండా కార్మికులు తీసుకున్న వ్యక్తిగత బ్యాంకు రుణాలు మాఫీ చేసింది. మరమగ్గాల ఆధునీకరణకు సబ్సిడీ ఇచ్చింది. దేశంలోని ఆధునిక మరమగ్గాల తయారీ సంస్థలతో సిరిసిల్లలో ప్రత్యేక మేళా ఏర్పాటు చేసి వ్యాపారుల్లో అవగాహన కల్పించింది. వస్త్ర ఉత్పత్తిలో తిరుపూరుకు దీటుగా రాష్ట్రం ఎదగాలన్న లక్ష్యంతో ఇక్కడి వ్యాపారులు, ఆసాములను తమిళనాడు స్టడీ టూర్కు పంపించింది. ముంబై, భీవండీ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన నేత కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో తిరిగి వచ్చి ఉపాధి పొందుతున్నారు. వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో రూ.300 కోట్లతో వర్కర్ టూ ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్ర సర్కారు నూలు, రంగులు, బట్టపైన పన్నుల మీద పన్నులు వేసి కార్మికుల రక్తం పీలుస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మూడు రోజుల పాటు ఆందోళనలు
చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన పిలుపు మేరకు వస్త్ర ఉత్పత్తిదారులు మూడు రోజుల పాటు ఆందోళనకు సిద్ధమయ్యారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం, సిరిసిల్ల కాటన్ వస్త్ర వ్యాపార సంఘం, సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం, సిరిసిల్ల యారన్ అసోసియేషన్, సిరిసిల్ల డయ్యింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఐక్యవేదిక ఆదివారం ఏర్పాటైంది. టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు 27, 28, 29 తేదీల్లో తెలంగాణతో పాటు, గుజరాత్లోని సూరత్, మహారాష్ట్రలోని ఇచ్చల్కరంజీ, మాలేగావ్, షోలాపూర్, భీవండీ, ముంబై, మధ్య ప్రదేశ్లోని బూరాన్పూర్లోని పరిశ్రమలు బంద్ పాటిస్తున్నట్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఐక్య వేదిక నేతలు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీచౌరస్తాలో నిరదీక్షలు చేపట్టనున్నారు.