కమాన్పూర్, నవంబర్ 26: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాయకల్ప బృందం శుక్రవారం సందర్శించింది. పీహెచ్సీలో అందిస్తున్న సేవలు, వైద్య సదుపాయాలను బృందం ప్రధాన ప్రతినిధి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ విభాగంలో చీటి ఇచ్చే దగ్గర నుంచి ఓపీ వైద్య సేవలు, ల్యాబ్, ప్రసవ గది (ఆపరేషన్ రూమ్), ప్రసవమైన మహిళలకు బెడ్ సౌకర్యం కల్పించే గది, మందులు నిల్వ చేసే ప్రత్యేక గది, ప్రజలు నిరీక్షించే హాల్తో పాటు పీహెచ్సీ ఆవరణలో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించి, సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీకి నిత్యం ఎంత మంది ఓపీ కోసం వస్తున్నారు? ఎలాంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వారు వస్తున్నారు? వారికి అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల వివరాలు తీసుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత శాతం పూర్తయిందనే వివరాలు అడిగారు. అలాగే రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు బృందం ప్రధాన ప్రతినిధి తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, డాక్టర్ అశోక్కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.