శుక్రవారం తెల్లవారుజామున చెట్టును ఢీకొన్న కారుl మానకొండూర్ శివారులో ఘటన
అక్కడికక్కడే ముగ్గురు అన్నదమ్ములు, డ్రైవర్ మృత్యువాతl మరొకరికి గాయాలు
మృతుల్లో రాజన్న సిరిసిల్ల పంచాయతీరాజ్ ఈఈ
డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
ఘటనపై మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ దిగ్భ్రాంతి
మానకొండూర్ రూరల్/సిరిసిల్లరూరల్/చందుర్తి/ రాంనగర్, నవంబర్ 26 : మరో పదిహేను నిమిషాలైతే ఎవరింటికి వారు వెళ్లే వారు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. పెద్దకర్మ కోసం వెళ్లొస్తుండగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురి ప్రాణాలు గాల్లో కలువడం కలిచివేసింది. మానకొండూర్ పోలీస్స్టేషన్ సమీపంలో కరీంనగర్-వరంగల్ రహదారి పక్కన శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన, తీరని దుఃఖాన్ని మిగిల్చింది. మృతుల్లో రాజన్న సిరిసిల్ల పంచాయతీరాజ్ శాఖ ఈఈ కొప్పుల శ్రీనివాసరావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులు ఉండడంతో స్వగ్రామం రత్నాపూర్లో విషాదం నిండింది. కాగా, ఘటనపై మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పెద్దకర్మ కోసం వెళ్లొస్తూ ఇళ్లకు చేరకముందే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ నిద్రమత్తో లేక అతి వేగంతోనో కా రు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృత్యువాత పడ్డారు. మానకొండూర్ మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ సమీపం లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
కరీంనగర్లోని జ్యోతినగర్కు చెందిన కొప్పుల శ్రీనివాస్రావు (55), కొప్పుల బాలాజీశ్రీధర్(45), కొప్పుల శ్రీరాజ్(42) ముగ్గురు సొంత అన్నదమ్ములు. శ్రీనివాస్రావు రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పని చేస్తుండగా, శ్రీధర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. శ్రీరాజ్ ఇటీవలే బయటిదేశాల నుంచి వచ్చాడు. ఈ ముగ్గురిది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ కాగా, వీరంతా పదేళ్ల క్రితమే కరీంనగర్కు వచ్చి స్థిరపడ్డారు. జ్యోతినగర్లో ఉంటున్న వీరి బావ పెంచాల సుధాకర్రావు సెరికల్చర్ డిపార్ట్మెంట్లో జగిత్యాల జిల్లా నుంచి రిటైర్ అయ్యారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని బంధువుల ఇంట్లో జరిగిన కర్మకాండ కోసం వీరంతా కలిసి మంగళవారం శ్రీనివాసరావు కారులో వెళ్లారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన ఇందూరి జలంధర్ (30)ను డ్రైవర్గా తీసుకెళ్లారు. బుధవారం అక్కడే ఉన్నారు. కార్యక్రమాలు పూర్తవడంతో గురువారం రాత్రి 10 గంటల తర్వాత కరీంనగర్కు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మరో 15 నుంచి 20 నిమిషాల్లో ఇండ్లకు చేరుకోవాల్సి ఉన్నది. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కరీంనగర్-వరంగల్ రహదారిపై మానకొండూర్ పోలీస్స్టేషన్ సమీపంలోకి రాగానే.. రోడ్డు పక్కనున్న చెట్టును కారు బలంగా ఢీకొంది. దట్టమైన మంచు కురుస్తుండడంతో ఈ ఘటనను రోడ్డుపై వెళ్లే వారు అంతగా గుర్తుపట్టలేకపోయారు. సుమారు 5 గంటల ప్రాంతంలో కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు వెంటనే అక్కడికి చేరుకోగా, అప్పటికే శ్రీనివాసరావు, అతని సోదరులు శ్రీధర్, శ్రీరాజ్తోపాటు డ్రైవర్ జలంధర్ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన పెంచాల సుధాకర్రావును వెంటనే దవాఖానకు తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు పంపించారు.
నిద్రమత్తే ముంచిందా..
ప్రమాదానికి డ్రైవర్ జలంధర్ నిద్రమత్తే కారణమని తెలుస్తున్నది. ఆ కారణంగానే చెట్టును బలంగా ఢీ కొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకున్నప్పటికీ వారున్న వేగానికి అవి కూడా కాపాడలేకపోయాయని అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతున్నది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.
మృతుల్లో ముగ్గురూ అన్నదమ్ములే..
ఒకే ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా, అందులో శ్రీనివాస్రావు, బాలాజీ శ్రీధ ర్, శ్రీరాజ్ ముగ్గురూ అన్నదమ్ములే. శ్రీనివాసరావుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన సోదరుడు బాలాజీ శ్రీధర్కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మరో సోదరుడు శ్రీరాజ్ ఇటీవలే బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందూరి జలంధర్ తాత్కాలికంగా డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య హిమాని, ఏడాదిన్నర వయసున్న కూతురు వేద హన్సీ ఉన్నారు. అలాగే, గాయపడ్డ పెంచాల సుధాకర్రావు సెరికల్చర్ డిపార్ట్మెంట్లో జగిత్యాల జిల్లా నుంచి రిటైర్ అయ్యారు.
మిన్నంటిన రోదనలు..
రోడ్డు ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు చేరుకుని విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువ ర్గం, సహచర ఉద్యోగులు పెద్ద ఎత్తున దవాఖానకు తరలి రావడంతో దవాఖాన ప్రాంగణమం తా బంధువుల రోదనలతో నిండిపోయింది. విష యం తెలుసుకున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కరీంనగర్కు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సం తాపం తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా దవాఖానకు చేరుకున్నారు. శ్రీనివాసరావు, శ్రీధర్, శ్రీరాజ్ కుటుంబ సభ్యులను ఎల్లాపి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు ఓదార్చారు.
లింగంపేటలో విషాదం
డ్రైవర్ జలంధర్ మృతితో ఆయన స్వగ్రామమైన లింగంపేటలో విషాదం నెలకొన్నది. పోస్టుమార్టం తర్వాత జలంధర్ మృతదేహాన్ని అక్కడికి తరలించగా, చిన్నారి తండ్రి మృతదేహంపై పడి రోదించిన తీరు గ్రామస్తులను కలిచివేసింది. సర్పంచ్ డప్పుల లక్ష్మి, కేడీసీసీబీ డైరెక్టర్ జలగం కిషన్రావు, ఎంపీటీసీ పెగ్గర్ల రమేశ్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రత్నాపూర్లో విషాద ఛాయలు..
రామగిరి, నవంబర్ 26: ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాస్రావు, బాలాజీ శ్రీధర్, శ్రీరాజ్ ముగ్గురు సొంత అన్నదమ్ములు. రామగిరి మండలం రత్నాపూర్కు చెందిన మాజీ సర్పంచ్ దివంగత కొప్పుల రాంకిషన్రావు కొడుకులు. ఒక కొడుకు గ్రామంలోనే ఉంటుండగా, ఈ ముగ్గురు తనయులు కరీంనగర్లో స్థిరపడ్డారు. ఈ ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీరాజ్ అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించగా, బంధువుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, పలువురు టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
మంత్రి కేటీఆర్, వినోద్కుమార్ దిగ్భ్రాంతి
రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యోగరీత్యా అందరి మన్ననలు అందుకున్న ఆయన ఆకాల మరణం పొందడం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామన్నారు.