పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా అధిష్ఠానం సహించింది
పదవీ కాంక్షతో ఆరోపణలు చేయడం సరికాదు
ఇప్పుడు రాజీనామా చేసి తప్పుడు ప్రచారం తగదు
రవీందర్సింగ్పై మేయర్ సునీల్రావు ధ్వజం
కార్పొరేషన్, నవంబర్ 26: టీఆర్ఎస్లో అనేక పదవులను చేపట్టి ఇప్పుడు పార్టీని వీడి విమర్శలు చేయడం శోచనీయమని, కేవలం పదవీ కాంక్షతోనే రవీందర్సింగ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కరీంనగర్ మేయర్ వై.సునీల్రావు ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలోని శ్వేత హోటల్లో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, నగరపాలక సంస్థ టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమంలో పని చేశారని గుర్తించిన సీఎం కేసీఆర్ జనరల్ స్థానంలో బీసీ మైనార్టీ వర్గానికి చెందిన రవీందర్సింగ్కు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్గా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ అన్ని అవాస్తవాలు, అభూత కల్పనలతో ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. 20 ఏళ్లుగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధిగా ఉన్నానని, తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని ఆయన చెప్పుకొంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు ఉద్యమకారులను పార్టీ గౌరవించిందని చెప్పిన రవీందర్సింగ్కు ఇప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారిందా? అని ప్రశ్నించారు. మేయర్ ఎంపికలోనూ అప్పటి ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల సూచనల ప్రకారం ‘మీకు మేయర్ పదవి వచ్చింది వాస్తవం కాదా?’ అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ టికెట్ ఇచ్చి కార్పొరేటర్గా గెలిపించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రవీందర్సింగ్కు కార్పొరేటర్ పదవి అంటే అంత చిన్న చూపెందుకని ప్రశ్నించారు. కార్పొరేటర్గా ఉండి అనేక పదవులు ఇచ్చిన టీఆర్ఎస్పై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి వినోద్కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్, నారదాసు లక్ష్మణ్రావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావులాంటి వారు ఇప్పటికీ పని చేస్తున్నారని, రాష్ట్రం ఏర్పాటు కాకముందే గంగుల కమలాకర్ పార్టీలో చేరి ఉద్యమించారని గుర్తు చేశారు. ఇలాంటి వారిపై ఉద్యమ ద్రోహులంటూ విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. పదవీ కాంక్షతో పార్టీపై విమర్శలు చేస్తున్నారని, నిజంగానే రవీందర్సింగ్కు ఎమ్మెల్సీ పదవిపై హామీ ఇచ్చి ఉంటే నామినేషన్ వేసేటప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మద్దతు ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. 2018 ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పని చేయడంతో పాటు అభ్యర్థి గంగుల ఓడిపోవాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? అని నిలదీశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా అధిష్ఠానం సహించి ఊరుకుందన్నారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, పని చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసేది రవీందర్సింగ్ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పుకొంటున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పార్టీలో క్రమశిక్షణ ఉన్న నాయకులుగా తామంతా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఇకపై టీఆర్ఎస్పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. పార్టీ నిర్ణయం మేరకు టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నగరపాలక సంస్థ టీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.