గోదావరిఖని, జనవరి 26: జిల్లాలో పార్టీ మరింత బలోపేతం లక్ష్యంగా పని చేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు ఖనిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి రామగుండం నియోజక వర్గంలో పార్టీ జెండా మోశానని, తెలంగాణ ఉద్యమంలో 40 రోజులు జైలుకు వెళ్లానని గుర్తు చేశారు. ఏ సందర్భంలో పార్టీ పిలుపు ఇచ్చినా కష్టపడి పని చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనపై మరింత బాధ్యత పెంచుతూ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి గులాబీ సైనికులంతా వారధులుగా ఉంటామన్నారు. రాబోయే కాలంలో జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో పార్టీని గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇస్తామని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగా అడగ్గానే రామగుండానికి మెడికల్ కాలేజీని మంజూరు చేశారన్నారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పార్టీ కార్యకర్తలు, నాయకులను సమన్వయపరుస్తూ జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు పని చేస్తానన్నారు. రోజులో 18 గంటలు ప్రజా సేవకు అంకితమవుతామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం లో సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు పెద్ద కుట్రలు జరిగాయని, ఆ సమయంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక సింగరేణి సంస్థకు పూర్వవైభవం వచ్చిందన్నారు. ఇప్పుడు తెలంగాణకు కల్పతరువుగా దినదినం అభివృద్ధి చెందుతున్న సంస్థను ప్రధాని మోడీ తన దోస్తులకు అమ్ముకునేందుకు పెద్ద కుట్ర పన్నుతున్నాడని చెప్పారు. కేంద్రంలో బీజేపీ చేస్తున్న కుయుక్తులను అడ్డుకునేందుకు సింగరేణిలో మళ్లీ ఉద్యమం తీసుకువస్తానని, సంస్థను కాపాడుకుంటామని తెలిపారు. సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని రద్దు చేసే దాకా ఉద్యమిస్తామన్నారు. తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం రామగుండం నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు ధాతు శ్రీనివాస్, ఇంజపురి పులెందర్, బాల రాజ్కుమార్, జనగామ సరోజని కవిత, నాయకులు తానిపర్తి గోపాల్రావు, అందె సదానందం, కర్నాటి సీతక్క, జేవీ రాజు తదితరులు ఉన్నారు.