కొత్తపల్లి, డిసెంబర్ 25: రాష్ట్రస్థాయి క్రాస్కంట్రీ పోటీలకు జిల్లా కేంద్రం మరోసారి వేదికకానున్నది. ఇప్పటికే పలుసార్లు పోటీలను విజయవంతంగా నిర్వహించిన అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు ఈ నెల 27న 8వ తెలంగాణ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు సిద్ధమయ్యారు. మానేరు తీరం సమీపంలోని క్రీడా పాఠశాల బైపాస్ రోడ్డు వద్ద పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నందెల్లి మహిపాల్ మాట్లాడారు. జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలను నిర్వహించడం ఇది ఐదోసారి అని పేర్కొన్నారు. ఈ సారి 33 జిల్లాల నుంచి 750 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్ పోటీల నిర్వహణలో పాల్గొంటున్నారని తెలిపారు. అండర్-16, 18, 20, 22 విభాగాల్లో బాలబాలికలు, స్త్రీ, పురుషులకు పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 2 కిలోమీటర్లు, 4, 6, 8, 10 కిలోమీటర్లు పరుగుపందెంలో క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల క్రీడాకారులు రిపోర్టు చేయనున్నారని వివరించారు. వీరికి వేయింగ్తో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 27వ తేదీన ఉదయం 8గంటలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించినవారిలో అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కడారి రవి, సంఘ సభ్యులు బీ రాజగోపాలాచారి, ఎస్.రమేశ్, హరికిషన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.