కార్పొరేషన్, సెప్టెంబర్ 25: నగరంలో చేపడుతున్న స్మార్ట్సిటీ పనుల్లో వేగంపెంచి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్రావుతో కలిసి స్మార్ట్సిటీ పనుల పురోగతిపై ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు, స్మార్ట్సిటీ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, నగరంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. నగరంలో రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలని సూచించారు. స్మార్ట్సిటీ, ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. టవర్ సరిల్ ప్రాంతంలో స్మార్ట్సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, నివారించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ, స్మార్ట్సిటీ పనులను కాంట్రాక్టర్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. శాతవాహన యూనివర్సిటీ, పద్మనగర్ వద్ద రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండకుండా ఇరువైపులా నాలాలు నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, స్మార్ట్సిటీ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరం లాంటిదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయన కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన 33 మంది, కరీంనగర్ అర్బన్ మండలానికి చెందిన 164 మంది, కొత్తపల్లి మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాం ప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు, ఆర్డీవో ఆనంద్కుమార్, తహసీల్దార్లు, ఆర్ అండ్బీ, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.