దళితుల ఆర్థిక స్థితిగతులు మార్చే గొప్ప పథకం
ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేయాలి
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
lప్రతి కుటుంబానికీ దళిత బంధు: మంత్రి హరీశ్రావు
రాష్ట్రానికే గర్వ కారణం: మంత్రి గంగుల
దళితబంధు ఇంటింటి సర్వేపై కరీంనగర్లో అధికారుల శిక్షణ తరగతులకు హాజరు
కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఎకడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. దళితుల ఆర్థిక స్థితిగతులు మార్చే గొప్ప పథకమని, ఇది దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. బుధవారం కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో దళితబంధు ఇంటింటి సర్వేపై స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు మంత్రులు తన్నీరు హరీశ్రావు, గంగుల కమలాకర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు. దళితబంధు సర్వే ఈ నెల 27 తేదీ నుంచి ప్రారంభించి, వారం రోజుల్లో విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేతో పాటు దళిత కుటుంబాలందరికీ బ్యాంకర్లు, తెలంగాణ దళితబంధు ఖాతాను తెరవాలని, రాజకీయాలకు అతీతంగా విమర్శలకు తావులేకుండా సర్వే చేయాలని ఆదేశించారు. దళిత కుటుంబాలన్నీ సంతృప్తి చెందేలా సర్వే నిర్వహించాలని, సమస్యలుంటే కలెక్టర్ దృష్టికి తేవాలని సూచించారు.
ప్రతి కుటుంబానికీ దళిత బంధు: మంత్రి హరీశ్రావు
రాష్ట్రంలో 15-16 లక్షల దళిత కుటుంబాలున్నాయని, వారందరికీ ప్రభుత్వం దళితబంధు అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ఉద్ఘాటించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడంలో ఈ పథకం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. దళితుల జీవితాల్లో వచ్చే మార్పును మనం త్వరలో చూడబోతున్నామని సంతోషం వెలిబుచ్చారు. ఇది పేద దళిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే పెద్ద కార్యక్రమమని, వారి ఇంటికి వెళ్లి ఓపికతో సర్వే చేయాలని సూచించారు. ఒక ఉమ్మడి కుటుంబం అయినా ఇద్దరు కొడుకులు వివాహం చేసుకొని వేర్వేరుగా ఉంటే మూడు కుటుంబాలుగా నమోదు చేసుకోవాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి దళితబంధు కోసం ప్రభుత్వం ఇప్పటికే 1500 కోట్లు విడుదల చేసి, కలెక్టర్ ఖాతాలో జమ చేసిందని, మరో 500 కోట్లు రెండు, మూడు రోజుల్లో మంజూరు చేస్తామని వెల్లడించారు. మొత్తం 2వేల కోట్ల ద్వారా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 21 వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు.లబ్ధిదారులు వారి అభిరుచి, నైపుణ్యతకు అనుగుణంగా ఏ యూనిట్ ఎంచుకుంటారో తెలుసుకోవాలని, అవసరమైతే యూనిట్ల ఎంపికకు అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. గ్రామంలో ఒకే తరహా యూనిట్ కాకుండా భూమి ఉన్న వారు డైయిరీ యూనిట్లు ఎంపిక చేసుకుంటే మంచిదని చెబుతూ ప్రోత్సహించాలని సూచించారు. సర్వే బృందాలు వివరాల సేకరణ అనంతరం వెంటవెంటనే దళితబంధు ఖాతా తెరిచేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి సర్వే అధికారులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అధికారులకు తగు సూచనలు చేశారు.
రాష్ట్రానికే గర్వ కారణం: మంత్రి గంగుల
పేద, దళిత కుటుంబాలలో వెలుగులు నింపాలనే లక్ష్యంతోనే దళితబంధుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దళితబంధు గొప్ప పవిత్ర కార్యక్రమం అని రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం కరీంనగర్ జిల్లా నుంచి ఏ పథకం ప్రారంభించినా విజయవంతమవుతుందనే నమ్మకంతో దళితబంధును ఇక్కడ ప్రారంభించారన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన దళితులను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. సీఎం ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా హుజురాబాద్లో పథకాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒకరూ భాగస్వామ్యులు కావాలన్నారు. దళితబంధు సర్వే బృందాల శిక్షణలో సీఎం కార్యాలయం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, రాజీవ్ హన్మంత్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్లాల్, గరీమా అగర్వాల్, సంధ్యారాణి, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, జడ్పీ సీఈవో ప్రియాంక, దళితబంధు సర్వే స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు.