రాష్ట్రంలోనే మొదటి స్థానం
వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్
నేడు కరీంనగర్లో వైద్య శాఖకు అభినందన కార్యక్రమం
ప్రశంసించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ టీకాల పంపిణీలో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. తొలి డోస్ ఇప్పటికే వంద శాతం పూర్తి కాగా, మంగళవారం నాటికి సెకండ్ డోస్ లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకున్నది. జాతీయస్థాయిలో నాలుగు, దక్షిణాదిలో రెండోస్థానం పొంది ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో బుధవారం వీరికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైద్యసిబ్బంది నిర్విరామ కృషితోనే కరీంనగర్కు జాతీయ ఖ్యాతి దక్కిందని డీఎంహెచ్వో జువేరియా చెప్పారు.
కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్లో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. జాతీయస్థాయిలో నాలుగు, దక్షిణ భారత దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సమక్షంలో మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయాన్ని ప్రకటించారు. లక్ష్యాన్ని పూర్తి చేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అభినందన సభను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కూడా ఆహ్వానించినట్లు చెప్పారు.
కట్టడిలో ఆదర్శం..
కొవిడ్ కట్టడిలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నది. 2020 మార్చిలో దేశంలో నే తొలిసారిగా కరీంనగర్లో కరోనా కలకలం రేగింది. ఇండోనేషియా నుంచి వచ్చిన మతగురువుల ద్వారా ఒకేరోజే 10 కరోనా కేసులు వెలుగుచూడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్లోనే తొలిసారి లాక్డౌన్ విధించారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కరోనాను పూర్తి స్థాయిలో నియంత్రించే స్థాయికి చేరి ఇతర జిల్లాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది.
వేగంగా వ్యాక్సినేషన్
కరీంనగర్ జిల్లాలో గతేడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మొదట జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానతోపాటు ఎంపిక చేసిన కొన్ని వైద్యశాలల్లోనే టీకాలు వేసేవారు. తొలుత హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకాలు వేయగా క్రమేణా విస్తరించారు. తర్వాతి కాలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీల్లో టీకాలు వేశారు. గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి వ్యాక్సిన్ వేశారు. గ్రామాల్లో ప్రజలు అందుబాటులో ఉండే ఉదయం, సాయంత్రం వేళ్లలో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. పట్టణాల్లోనూ ఇదే తరహాలో వేశారు. ప్రతి రోజు దాదాపు 150 బృందాలు ఈ డ్రైవ్లో నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. ఇదే సమయంలో జ్వర సర్వేను పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేసుకోవాలని అవగాహన కల్పించారు. ఇంట్లో అర్హులందరూ టీకాలు వేసుకుంటే కరోనా ఫ్రీ పేరుతో డోర్లకు స్టిక్కర్లు అతికించారు. స్టిక్కర్లు లేని ఇండ్లకు వెళ్లి టీకాలు వేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. ఈ కారణంగానే వాక్సినేషన్లో వంద శాతం దాటామని చెప్పారు.
లక్ష్యానికి మించి..
కరీంనగర్ జిల్లా వ్యాక్సినేషన్లో దక్షిణ భారత్లో రెండో స్థానంలో నిలిచినట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. మంగళవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సమక్షంలో వెల్లడించారు. మొదటి స్థానంలో బెంగళూర్ సిటీ ఉన్నట్లు, జాతీయ స్థాయిలో చూస్తే కరీంనగర్ నాలుగో స్థానంలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో మొత్తం 11,19,947 మంది జనాభా ఉన్నారు. ఇందులో 7,92,923 మంది టీకాలకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 8,27,103 (104 శాతం)మందికి మొదటి డోసు టీకా వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిర పడిన వారికి కూడా టీకాలు ఇచ్చారు. అలాగే రెండో డోసు మంగళవారం వరకు 7,94,404 మందికి ఇచ్చారు. ఇది 100.19 శాతంగా నమోదైంది.
అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
వ్యాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించగా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అధికారులను, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది..
వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఇప్పటికే 102.89 శాతాన్ని అధిగమించాం. రెండో డోస్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, దక్షిణ భారత దేశంలో రెండో స్థానంలో ఉన్నాం. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 26 లోగా రెండో డోస్ వంద శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మంగళవారం నాటికే ఈ లక్ష్యాన్ని పూర్తి చేశాం. జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంతో పాటు పట్టణాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సినేషన్ సెంటర్లు అందుబాటులో ఉంచాం. కరోనా నియ్రంతణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విస్తృత ప్రచారం చేశాం. ప్రజలు ఇండ్లలో ఉండే సమయం ఉదయం, సాయంత్రం వెళ్లి వ్యాక్సినేషన్ చేశాం. ప్రజలు కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించారు. ప్రజలను మోటివెట్ చేయడంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకున్నాం. మా సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించారు. ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహం కూడా తోడైంది. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది.
థర్డ్వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం..
కొవిడ్ వ్యాక్సినేషన్లో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించడంపై మంత్రి గంగుల హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొవిడ్ మొదటి డోస్ వ్యాక్సినేషన్ 104 శాతం పూర్తిచేయగా, సెకండ్డోస్ను 100.19 శాతం పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 2వ స్థానంలో నిలువడం గర్వకారణమన్నారు. కొవిడ్ టీకాల్లో బెంగళూరు తర్వాత కరీంనగర్కు రెండోస్థానం లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న తరహాలోనే థర్డ్వేవ్ను సైతం ఎదుర్కొంటామని చెప్పారు. ఇందుకు అధికార యం త్రాంగం సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. దవాఖానల్లో తగిన వసతులు కల్పించినట్లు చెప్పారు. బూస్టర్డోస్, టీనేజర్లకు వ్యాక్సిన్పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. 15 నుంచి 18 ఏండ్ల వయసున్న 60 వేల మందికి వ్యాక్సిన్ అందించామన్నారు. ఇంటింటా జ్వర సర్వేను నిర్వహిస్తూ కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఇంటి దగ్గరే కిట్లను అందిస్తున్నామని చెప్పారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక సారలమ్మ జాతరలో కరోనా ప్రబలకుండా అన్ని జాగత్తలు తీసుకుంటున్నామన్నారు.