కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే కీలకమని, దేశాభివృద్ధికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన 12వ జాతీయ ఓటరు దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హకును వినియోగించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒకరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఓటరు జాబితాల సవరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. ఓటరు జాబితాలను అన్ని పార్టీలకు పంపుతామని, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారని, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు లేని వారు వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని నిర్ణయించిందని, దీని ద్వారా బోగస్ ఓట్లకు అవకాశం ఉండదని తెలిపారు. ఎన్నికల సంఘం ఈవీఎంలలో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు నోటా కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఓటరు నమోదు, ఓటర్లను చైతన్యవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించిన రిటర్నింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డికి రూ. 15 వేల నగదుతో పాటు అవార్డును ఎన్నికల సంఘం ప్రకటించినట్లు తెలిపారు. అవార్డును అదనపు కలెక్టర్ చేతుల మీదుగా రవీందర్రెడ్డికి అందజేశారు. కొత్తగా ఓటరుగా నమోదైన యువతకు గుర్తింపు కార్డులు అందజేశారు. సమావేశంలో కరీంనగర్ ఆర్డీవో ఆనంద్కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి లక్ష్మారెడ్డి, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జనవరి 25: ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేయాలని సర్పంచ్ చామనపల్లి అరుణ గ్రామస్తులకు సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలోని పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శి రాజు, ఓటర్లు పాల్గొన్నారు.