బల్దియాల్లో సమస్య పరిష్కారానికి నూతన ఆవిష్కరణలకు అవకాశం
సరికొత్త ఆలోచనలకు ప్రోత్సాహకాలు
ఈనెల 31లోగా సమర్పించేందుకు అవకాశం
కార్పొరేషన్, డిసెంబర్ 24: నగరాలు, పట్టణాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్త నియంత్రణకు రాష్ట్ర మున్సిపల్ శాఖ సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రజలను భాగస్వాములను చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. పట్టణాల్లో ప్రతి రోజు వెలువడే చెత్తలో అత్యధిక శాతం ప్లాస్టిక్ వస్తున్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించడంతో పాటు ప్లాస్టిక్ను వినియోగించకుండా చూడాలన్న విషయంలోనూ మున్సిపాలిటీలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్లాస్టిక్ కవర్లకు బదులు బట్ట సంచులను వినియోగించాలని ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అలాగే, ఇండ్ల నుంచి వెలువడే చెత్తను నియంత్రించేందుకు హోం కంపోస్టు, చెత్త రీసైక్లింగ్ తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పట్టణాల్లో పారిశుధ్య సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతోనే సరికొత్త ఆలోచనలకు పోటీలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో స్వచ్ఛత ఇన్నోవేషన్ టెక్నాలజీ చాలెంజ్ కార్యక్రమం చేపట్టింది. ఈ పోటీల్లో సరికొత్త ఆలోచనలతో వచ్చే వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.
చెత్తను తగ్గించే కొత్త ఆలోచనలకు అవకాశం
నగరాలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు నిర్వహిస్తున్న పారిశుధ్య పనులకు తోడు ఆయా ప్రాంతాల్లో ఉన్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు సరికొత్త ఆలోచనలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పోటీల్లో భాగంగా ప్రధానంగా చెత్త ఉత్పత్తిని తగ్గించడం, ప్లాస్టిక్ నిషేధం, డిజిటల్ మోనిటెనింగ్, కొత్త ఆవిషరణలు తదితర అంశాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నగర పరిధిలోని రెసిడెన్షియల్, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, ఎన్జీవోస్, విద్యా సంస్థలు, ఇతర సంస్థల నుంచి ఇన్నోవేషన్ల ఆలోచనలను నివేదిక రూపంలో ఆహ్వానిస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో అత్యుత్తమంగా ఎంపికైన మొదటి మూడు విభాగాలకు ప్రథమ బహుమతి రూ.15,000, ద్వితీయ బహుమతి రూ.10,000, తృతీయ బహుమతి రూ.5,000 చొప్పున అందించనున్నారు. తమకు వచ్చిన ఆలోచనలను ఈనెల 31లోగా స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్లో పంపించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన నివేదికలను ఆయా మున్సిపాలిటీల స్థాయిలో కమిటీలు జనవరి 6వ తేదీలోగా పరిశీలించి రాష్ట్రస్థాయికి పంపిస్తారు. రాష్ట్ర స్థాయిలో వచ్చిన ఇన్నోవేషన్ ఆలోచనలు జనవరి 15లోగా పరిశీలించి, ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేస్తారు.