గోపాల్పూర్లో స్వయంబూ గణపతి సన్నిధిలో ప్రత్యేక పూజలు
కరీంనగర్ రూరల్, నవంబర్ 24: కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ చింతల చెరువు వద్ద స్వయంబూ గణపతి సన్నిధిలో బుధవారం వేద పండితుడు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ గణేశాలయ నిర్మాణ సమితి సభ్యులు సహస్ర మోదక హవనం వైభవంగా నిర్వహించారు. ఉదయం గో పూజతో ప్రారంభించిన వేదపండితుడు పురాణం మహేశ్వర శర్మ బృందం గణేశ్ విగ్రహాన్ని శుద్ధి చేసి, గణపతి పూజ, పుణ్యాహవాచనం, తదితర పూజలు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహిచారు. పూజల్లో జడ్పీటీసీ పురుమల్ల లలిత-శ్రీనివాస్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ ఊరడి మంజుల-మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఉపసర్పంచ్ ఆరె శ్రీకాంత్, దుర్శేడ్ సింగిల్ విండో మాజీ చైర్మన్ మంద రాజమల్లు, వార్డు సభ్యులు, చెర్లభూత్కూర్, జూబ్లీనగర్ సర్పంచులు రమణారెడ్డి, భారతి, నాయకులు రాములు, శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.