కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి సవరణ జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటరు నమోదు, సవరణపై మంగళవారం ఆయన ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారందరిని ఫాం-6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలన్నారు. చనిపోయిన వారి పేర్లు సంబంధిత బంధువుల నుంచి ఫాం-7 ద్వారా తీసుకొని తొలగించాలని సూచించారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించి వారి పేరు ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. కరీంనగర్ నియోజకవర్గంలో 390, చొప్పదండిలో 327, మానకొండూర్లో 316, హుజూరాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. ఫాం-6కు సంబంధించి కరీంనగర్లో 112, చొప్పదండిలో 178, మానకొండూర్ లో 161, హుజూరాబాద్లో 2,412 దరఖాస్తులను అప్డేట్ చేశామన్నారు. ఫాం 7కు సంబంధించి కరీంనగర్లో 21, చొప్పదండిలో 42, మానకొండూర్లో 301, హుజూరాబాద్లో 3 దరఖాస్తులు అప్డేట్ చేసినట్లు పేర్కొన్నారు. ఫాం-8కి సంబంధించి కరీంనగర్లో 71, చొప్పదండిలో 39, మానకొండూర్లో 29, హుజూరాబాద్లో 20 దరఖాస్తులు అప్డేట్ చేసినట్లు తెలిపారు. ఫాం 8ఏ కు సంబంధించి కరీంనగర్లో 16, హుజూరాబాద్లో 13 దరఖాస్తులు అప్డేట్ చేసినట్లు చెప్పారు. సమావేశంలో మానకొండూర్ ఈఆర్వో ప్రియాంక, కరీంనగర్ ఈఆర్వో ఆనంద్కుమార్, చొప్పదండి ఈఆర్వో శ్రీలత, హుజూరాబాద్ ఈఆర్వో రవీందర్రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.