కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉమ్మడి జిల్లా నుంచి 27మంది అభ్యర్థులు 53నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదలైంది. అదేరోజు నుంచి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నామినేషన్లు స్వీకరించారు. ఆఖరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువలా వచ్చాయి. 13మంది అభ్యర్థులు 31 నామినేషన్లను దాఖలు చేశారు. ఒక్కో అభ్యర్థి రెండు మూడు, కొందరు నాలుగైదు సెట్లను వేశారు. కాగా బుధవారం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సమక్షంలో అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఈ నెల 26 వరకు ఉప సంహరణకు గడువు ఉంది. తిరస్కరణ కాని అభ్యర్థులు 26వ తేదీ వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల బరిలో ఎవరెవరు నిలుస్తారనేది అదే రోజు తేలనుంది. కాగా అధికార టీఆర్ఎస్ నుంచి టి.భానుప్రసాద్రావు, ఎల్.రమణ దాఖలు చేయగా, చాంద్పాషా మహ్మద్ భారతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) పక్షాన నామినేషన్ దాఖలు చేశారు. మరో అభ్యర్థి టీఆర్ఎస్ పక్షాన అనధికారికంగా, స్వతంత్ర అభ్యర్థిగా కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక మిగతా వారంతా స్వతంత్ర అభ్యర్థులుగానే దాఖలు చేశారు.