కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం బ్యాంకర్లతో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డీఎల్ఆర్సీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 2021-22 వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రౌండింగ్ చేసేందుకు రుణాలు మంజూరు చేయాలన్నారు. 2021-22 వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రూ.4,040.5 కోట్ల రుణాలు లక్ష్యం కాగా సెప్టెంబర్ 30 వరకు రూ.2,765 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. ఇందులో షార్ట్టర్మ్ పంట ఉత్పత్తులకు సంబంధించి రూ.1,860.5 కోట్లు లక్ష్యం కాగా రూ.825 కోట్లు మంజూరు చేశారని, రూ. 2,921.5 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు లక్ష్యం కాగా రూ. 1,169 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగతా ఇతర రుణాలను లక్ష్యం మేరకు మంజూరు చేయాలన్నారు. అర్హులైన రైతులకు యాసంగి సీజన్కు లక్ష్యం మేరకు పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. మండలాల్లో ఎంపీడీవోలు బ్యాంకర్లతో నెల వారీగా సమావేశాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాలను మంజూరయ్యేలా చూడాలన్నారు.
పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ఆవిషరణ
నాబార్డ్ ద్వారా 2022-23 సంవత్సరానికి గానూ జిల్లాకు రూ. 4,423 కోట్లతో తయారు చేసిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎల్డీఎం లక్ష్మణ్, నాబార్డ్ ఏజీఎం పీ అనంత్, ఆర్బీఐ ఏజీఎం రహమాన్, డీఆర్వీవో శ్రీలత, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎస్ఎంబీ రామారావు, కేడీసీసీ బ్యాంక్ సీఈవో ఎన్ సత్యనారాయణరావు, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఆర్డీవోలు ఆనంద్ కుమార్, రవీందర్రెడ్డి, బ్యాంకర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.