కమలాపూర్, అక్టోబర్ 23: దళితబంధు పథకాన్ని ఆపిచ్చింది బీజేపీ కాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దమ్ముంటే చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని శంభునిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కిషన్రెడ్డి టీఆర్ఎస్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితబంధు తాను రాజీనామా చేయడంతోనే వచ్చిందని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించినా బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కలెక్టర్ ఖాతాలో డబ్బులు జమ చేస్తే కలెక్టర్ వద్దనే డబ్బులు ఉంటాయని, కానీ.. ఎన్నికలు ముగియగానే వాపసు పోతాయని ఈటల రాజేందర్ తప్పుడు ప్రచారం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దళితులు బీజేపీకి ఓట్లు వేయరనే కుట్రతో పథకం ఆపివేయించాలని ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి నిలిపివేయించారని ధ్వజమెత్తారు. బీజేపీ దళితబంధు పథకాన్ని ఆపించినా ఆగదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం గుర్తు చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తామని చెప్పాకనే ఈటల రాజేందర్ ప్రజలను ఓట్లు అడుగాలన్నారు. గెలిస్తే ఏం చేస్తరో చెప్పకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్రెడ్డి దళితబంధు పథకం ఈటల రాజీనామాతోనే వచ్చిందని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో బీజేపీ కార్యకర్తలే ఎస్ఐ, టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉప్పల్ రోడ్డు ప్రమాదంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్నేహితుడు కారుతో ఢీ కొట్టగా ఆటో డ్రైవర్ చనిపోతే బాల్క సుమన్ అనుచరులంటూ తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసేలా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. బట్టకాల్చి మీదేస్తున్న ఈటల రాజేందర్ ప్రజల విశ్వాసం కోల్పోయి, ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సోషల్ మీడియాలో మార్పింగ్ చేస్తూ టీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు గమనిస్తున్నారని ఈనెల 30న జరిగే ఉప ఎన్నికలో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. సర్పంచ్ పెండ్యాల రవీందర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.