పెద్దపల్లి సబ్కోర్టు సీనియర్ సివిల్ జడ్జి వరూధుని
న్యాయ విజ్ఞాన సదస్సులు
ధర్మారం, అక్టోబర్ 23: పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని పెద్దపల్లి సబ్కోర్టు సీనియర్ సివిల్ జడ్జి వరూధిని తెలిపారు. ఈ మేరకు శనివారం ధర్మారం మండ లం బొట్లవనపర్తిలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ నెల 2 నుంచి నవంబర్14వ తేదీ దాకా జాతీయ లీగల్ సెల్ (నల్సా) పాన్ ఇండియా అవెర్నెస్ ఔట్ రీచ్ ప్రోగ్రాం సందర్భంగా మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వరూధిని మాట్లాడుతూ, మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అఫిడవిట్ ధ్రువపత్రాలు సమర్పిస్తే నిరుపేద మహిళలు, పిల్లలు, బధిరులు, మానసిక దివ్యాంగులకు కోర్టు ద్వారా ఉచిత సేవలు అందిస్తామని ప్రకటించారు. ఈ సదస్సుకు హాజరైన ప్యానల్ లాయర్ కుడిక్యాల శ్రీధర్, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ రెడపాక ప్రమీల శ్రీనివాస్, ఉప సర్పంచ్ మోటపలుకుల సత్యనారాయణ, వార్డు సభ్యులు, అడ్వకేట్లు బొట్ల లక్ష్మీనారాయణ, ఆకారి మహేశ్ సీనియర్ సివిల్ జడ్జిని సన్మానించారు. అనంతరం ఆమె ఖిలావనపర్తిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించగా, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సదస్సులో ఎస్ఐ శ్రీనివాస్, కరీంనగర్ పారా లీగల్ వాలంటీర్ కుక్కల ఐలయ్య, అడ్వకేట్లు హన్మాన్ సింగ్, శ్రీధర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
రామగిరి, అక్టోబర్ 23: ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన తప్పక కలిగి ఉండాలని మంథని జూనియర్ సివిల్ జడ్జి మందాడి శ్రీధర్ పేర్కొన్నారు. మంథని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నల్సా లీగల్ సర్వీసెస్ వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొని తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేయవద్దన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, ఎస్ఐ రవి ప్రసాద్, న్యాయవాది సుభాష్, సమ్మెట మల్లేశ్ ఉన్నారు.
సుల్తానాబాద్ రూరల్, అక్టోబర్ 23 : చిన్నబొంకూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి పార్థ సారధిరావు మాట్లాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, ఏజీపీ తిరుపతిరెడ్డి , ప్యానల్ న్యాయవాది సత్యనారాయణ, న్యాయవాదులు లక్ష్మీకాంతరెడ్డి, రమేశ్, రాజేంద్రప్రసాధ్, కరుణాకర్, యుగేంధర్, సర్పంచ్ ఆర్నకొండ రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంజీవరెడ్డి, హెచ్ఎం రాజేందర్ తదితరులు ఉన్నారు.