60వేలకు పైగా మంది రాక
సమకూరిన 28లక్షల ఆదాయం
వేములవాడ టౌన్, ఆగస్టు 23: శ్రావణ మాసం మూడో సోమవారం వేములవాడ రాజ న్న క్షేత్రం కిటకిటలాడింది. ఎక్కడ చూసినా సందడి కనిపించింది. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో సుమారు 50వేలకుపైగా భక్తులు తరలివచ్చారు. అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ, నగరేశ్వరాలయాలకు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలను నిలిపివేయగా, ఉదయం 4 గంటల నుంచే ఉచిత, శీఘ్ర దర్శన క్యూలైన్లలో భక్తులు బారులు తీరి దర్శనం చేసుకున్నారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, బెల్లాన్ని జోకించి పంచిపెట్టా రు. కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్లో 193 జంటలు కల్యాణాల మొక్కులు తీర్చుకోగా, స్వామివారిని దాదాపుగా 60వేలకు పైగా మంది దర్శించుకున్నారు. వివిధ ఆర్జిత సేవల ద్వారా 28 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఈవో కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్తోపాటు పర్యవేక్షకులు గుండి నర్సింహమూర్తి అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడ డీఎస్పీ చం ద్రకాంత్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ చంద్రకాంత్ భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
ఘనంగా మహాలింగార్చన
శ్రావణ మాస సోమవారం సందర్భంగా రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వరాలయంలో మహా లింగార్చన కార్యక్రమాన్ని స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏటా శ్రావణ మాసంలోని మూడో సోమవారం శ్రీ భీమేశ్వరాలయంలో లింగార్చనను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో ఆలయ అద్దాల మండపంలో రాత్రి అర్చకులు, బ్రాహ్మణులు 366 లింగాలు, 366 జ్యోతులను లింగాకారంగా వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేదమంత్రాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నమిలకొండ ఉమేశ్, మురళీకృష్ణ, వేద పండితులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.