చొప్పదండి పీఏసీఎస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
వివరాలు వెల్లడించిన విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి
చొప్పదండి, డిసెంబర్ 22: చొప్పదండి వ్యవసాయ సహకార సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులకు ప్రమాద బీమా కల్పించడమే గాకుండా చదువుకుంటున్న వారి పిల్లలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పీఏసీఎస్ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన పాలకవర్గం కీలక నిర్ణయాలను ప్రకటిస్తూ తీర్మానాలు చేసింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి మాట్లాడుతూ ఏదేని ప్రమాదాల్లో మరణించిన వారి రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకే ప్రమాద బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు లేని 12 మంది విద్యార్థులకు యేటా రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. సంఘం నుంచి రుణం తీసుకున్న రైతులకు రూ.4 లక్షలు, ప్రమాదంలో గాయపడి అంగ వైకల్యం పొందిన వారికి రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ సీజన్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏడు సెంటర్లను ఏర్పాటు చేసి లక్షా పదివేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. సంఘం అభివృద్ధికి సహకరిస్తున్న పౌర సరఫరాల మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, జిల్లా సహాయ అధికారి శ్రీమాల, సీనియర్ ఇన్స్పెక్టర్ తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సంఘ సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు ముద్దం మల్లేశ్గౌడ్, డైరెక్టర్లు గుర్రం ఆనందరెడ్డి, కొస్న తిరుపతిరెడ్డి, బండారి కొమురయ్య,క ళ్లెం లక్ష్మారెడ్డి, దుర్గం పద్మ,నాంపెల్లి మల్లయ్య, సునంద, నర్సయ్య, బాలయ్య, మంగళారపు మల్లారెడ్డి, లంబు రాజిరెడ్డి పాల్గొన్నారు.