హుజూరాబాద్, అక్టోబర్ 22: బీసీలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలన కొనసాగిస్తున్నదని, ఆ పార్టీకి బీసీల ఓట్లడిగే హక్కు లేదని మాజీ మంత్రి ఎల్.రమణ మండిపడ్డారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ బీసీల అభ్యున్నతికి ఏనాడూ కృషి చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని, ఆయన వల్లే ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాయన్నారు. బీజేపీ ప్రభుత్వం చెల్లించే 4శాతం ఉన్న త్రిఫ్ట్ను రద్దు చేస్తే చేనేత కార్మికుల మేలు కోరి రాష్ట్ర ప్రభుత్వం 16శాతం చెల్లిస్తున్నదన్నారు. దేశ వ్యాప్తంగా కోటి మందికి జీవనోపాధి ఇస్తున్న చేనేత రంగానికి రూ.400కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారని, ఇది తెలంగాణ రాష్ట్రం కార్మికులకు ఇస్తున్న బడ్జెట్ కంటే చాలా తక్కువని దుయ్యబట్టారు. అలాగే రూ.30లక్షలు టర్నోవర్ దాటిన చేనేత సహకార సంఘాలకు ఇచ్చే మార్కెటింగ్ రాయితీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీంతో పాటు హ్యాండ్లూమ్ బోర్డు, మహాత్మాగాంధీ బునకర్ బీమా యోజన, ఐసీఐసీఐ ఆరోగ్య బీమా వంటి పథకాలను రద్దు చేసి చేనేత కార్మికుల ఉసురు పోసుకుందన్నారు. చేనేత బీమా ప్రకటనతో కార్మికులకు భరోసా కలిగిందని, అనుబంధ కార్మికులకు కూడా ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లాలో 1200 ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రభుత్వం రూపకల్పన చేసిందని చెప్పారు. మంత్రి కేటీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలోకి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు. కూలీని ఓనర్ను చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. 50 ఏండ్లు నిండిన చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు, సహకార సంఘాలకు మార్కెటింగ్ సాయం ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్లో నేత బజార్ ప్రారంభించబడిందని, దీనిద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నదన్నారు. ఈటల రాజేందర్కు పద్మశాలీలు అంటే చాలా చిన్న చూపు అని, ఏ రోజు వారి బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా నేత వస్ర్తాలపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం విధించి కార్మికుల జీవితాలను అగాథంలోకి నెట్టిందన్నారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతున్నదని, ఇప్పటి వరకు రూ.1700 కోట్లను చీరలపై ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. నాయకులు చింత ప్రభాకర్, సమ్మారావు, స్వర్గం రవి, సంగెం ఐలయ్య, బుర్ర మల్లేశం, బింగి శ్రీధర్, వాసాల రమేశ్, రోషం బాలు, గుండు భూపేశ్ తదితరులున్నారు.