సింగరేణి దవాఖానలో రూ.96 లక్షలతో ఏర్పాటు
సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి సేవలు
హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక కుటుంబాలు
గోదావరిఖని,ఆగస్టు 21: గోదావరిఖని సింగరేణి దవాఖానలో రూ. 96 లక్షలతో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా పూర్తిచేసి సెప్టెంబర్ నుంచి సేవలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా థర్డ్వేవ్ వస్తుందని వార్తలు వస్తున్న తరుణంలో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి రానుండడంతో కార్మికలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ ప్లాంట్ ద్వారా గంటకు 45 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ను తయారు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. వందలాదిమంది రోగులకు ఏకకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొంటున్నారు. ప్లాంట్కు సంబంధించి ఇప్పటికే రెండు ఎయిర్ రిసీవ్ ట్యాంకర్లు, ఎయిర్ ఫిల్టర్లు, కంప్రెషర్ దవాఖానకు చేరుకున్నాయని వైద్యాధికారులు తెలిపారు. జనరేటర్ ద్వారా ప్లాంట్ను రన్ చేయనున్నట్లు చెప్పారు. గత రెండు దశల్లో కరోనా కాటుకు అనేక మంది కార్మికులు బలయ్యారు. ఈ నేపథ్యంలో మూడో ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు సింగరేణి చైర్మన్ అండ్ మెనేజింగ్ డైరెక్టర్ నడిమెట్ల శ్రీధర్ తగిన చర్యలు చేపడుతున్నారు. భద్రాది కొత్తగూడెం, గోదావరిఖని, భూ పాలపల్లి, మంచిర్యాలలోని సింగరేణి దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఖనిలో కొనసాగుతున్న పనులను ఆర్జీ-1 జనరల్ మేనేజర్ కల్వల నారాయణ పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి సూచనలిస్తూ పనులు వేగంగా జరిగేలా చూస్తున్నారు. ప్లాంటు అందుబాటులోకి వస్తే రామగుండం డివిజన్-1, 2,3 ఏరియాలకు సంబంధించిన కార్మికులు, వారి కుటుంబీకులకు మేలైన వైద్యసేవలు అందనున్నా యి. సింగరేణి బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టడంపై ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.