ఉద్యానవన సాగుపై అవగాహన కల్పించండి
అమాత్యుడు రామన్నకు హరిత కానుక అందిద్దాం
జడ్పీ స్థాయి సంఘాల సమావేశంలో చైర్పర్సన్ అరుణ
రాజన్న సిరిసిల్ల, జూలై 22 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అధికారులను ఆదేశించారు. పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన స్థాయి సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున చెక్డ్యాంల నిర్మాణం తొందరగా పూర్తయ్యేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. పల్లె ప్రగతిలో మిగిలిన పనులు ప్రగతిలో ఉండేలా చూడాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా అమాత్యుడికి హరిత కానుక అందిద్దామని, ఇందుకోసం ప్రతి మండలంలో 50 వేల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. లాభదాయకమైన పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఎక్కువగా ఉద్యానవన సాగుపై దృష్టిసారించేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులకు సూచించారు.
వినోద్కుమార్ జన్మదిన వేడుకలు
ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ జన్మదిన వేడుకలను పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ అరుణ, వైస్ చైర్మన్ సిద్ధం వేణు కేక్ కట్ చేశారు. సమావేశంలో జడ్పీటీసీలు పుర్మాణి మంజుల, కత్తెరపాక ఉమ, కొమిరిశెట్టి విజయ, మ్యాకల రవి, ఏశ వాణి, చీటి లక్ష్మణ్రావు, గట్ల మీనయ్య, గుండం నర్సయ్య, సీఈవో గౌతమ్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చాంద్పాషా, అహ్మద్, డీపీవో రవీందర్ పాల్గొన్నారు.
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
కలెక్టరేట్, జూలై 22: షెడ్యూల్డ్ కులాల నిరుపేద వ్యవసాయ ఆధారిత దళిత మహిళలకు పంట సహాయార్థం ప్రభుత్వం చెక్కు లు మంజూరు చేయగా, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్ అందజేశారు. గురువారం వారు కలెక్టరేట్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భూమి లేని నిరుపేద దళిత మహిళలకు మూడెకరాల భూ పంపిణీ పథకం ద్వా రా లబ్ధి పొందిన 36మందికి మొదటి పంట సహాయార్థం ఎకరా నికి రూ.14,600 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఇక్కడ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్కుమార్ తదితరులు ఉన్నారు.