పెరుగుతున్న కంటి సమస్యలు
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్య నిపుణులు
హుజూరాబాద్ రూరల్, జనవరి22: కరోనా మహ్మమ్మారి ప్రభావంతో విద్యా సంస్థలు నడవడంలేదు. దీంతో చిన్నారులు ఇంటివద్దనే ఉంటున్నారు. ఇదే సమయంలో పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కొన్ని విద్యాసంస్థలు స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు తల్లిదండ్రులు చిన్నారులను సెల్ఫోన్కు అలవాటు చేయడంతో పిల్లలు పూర్తిగా వాటికే అలవాటు పడుతున్నారు. కాగా చిన్న వయసు నుంచే ఫోన్ అలవాటు మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
స్మార్ట్ఫోన్లతో సమస్యలే ఎక్కవ..
స్మార్ట్ఫోన్లతో ప్రయోజనాలకన్నా అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏడాది వయసు పిల్లల నుంచే స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్నది. స్మార్ట్ఫోన్ నుంచి వచ్చే రంగు రంగుల కిరణాలు కార్నియాపై (నల్లగుడ్డు) తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యం 5 నుచి 6 గంటలు ఫోన్ వాడే వారిలో కార్నియా సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి సమస్యలు వచ్చినవారిలో 15 నుంచి 25 యేండ్లలోపువారే ఎక్కువగా ఉన్నారు.
తతెత్తుతున్న ఇబ్బందులు..
స్మార్ట్ఫోన్, కంప్యూటర్లు ఎక్కువగా ఉపయోగించడంతో మెడ నొప్పులు, డిస్స్లు ఒత్తిడికి గురై నరాలు బిగిసుకుపోవడం, చేతి వేళ్లకు తిమ్మిరు, స్పర్శ కోల్పోవడం. రాత్రివేళలో తలనొప్పి, నిద్ర పట్టకపోవడం లాంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
స్మార్ట్ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకోవాలి. కళ్లకు ఫోన్కు 15 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ముఖానికి దగ్గరగా పెట్టుకోవద్దు. 20 నిమిషాల పాటు ఫోన్, కంప్యూటర్ వాడితే 20 సెంకడ్లపాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై కాకుండా ఉంటుంది. చీకట్లో స్మార్ట్ ఫోన్ చూడకూడదు. కంప్యూటర్తో పని చేసేవారు యాంటీ రిఫ్లెక్షన్ గ్లాస్ వాడాలి. ప్రతి రోజూ ఫోన్, కంప్యూటర్ వాడే వారు ఐ డ్రాప్స్ వాడాలి.