ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు సేకరించిన వైద్య, మున్సిపల్ సిబ్బంది
నగరంలో సర్వేను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్, కమిషనర్, డీఎంహెచ్వో
కార్పొరేషన్, జనవరి 22: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి చేపట్టిన జ్వర సర్వే శనివారం నగరంలో కొనసాగింది. 60వ డివిజన్లలో వైద్య, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీలు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేశారు. అలాగే, అర్హులకు కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. 60 సర్వే బృందాలు ఆయా డివిజన్లలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా, రాంనగర్లో ఇంటింటా జ్వర సర్వేను డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, డీఎంహెచ్వో జువేరియా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా లక్షణాలు ఉన్న వారికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా కరోనా నిబంధనలను పాటించాలని కోరారు. అర్హులంతా కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్రావు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 22: కొత్తపల్లి పట్టణంలోని 8వ వార్డులో జ్వర సర్వే చేపట్టారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేసి, జాగ్రత్తలను సూచిస్తున్నారు. సర్వేలో ఆర్పీలు మంజుల, స్వర్గం పద్మ, సంధ్యారాణి, ఏఎన్ఎం సంధ్య, టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే బాబా తదితరులు పాల్గొన్నారు.